అక్షరటుడే, వెబ్డెస్క్: Donald Trump | భారత్పై ఇటీవల భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది తాను భారత పర్యటనకు వస్తానన్నారు.
రష్యా నుంచి ముడి చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నామనే కారణంతో ట్రంప్ (Donald Trump) భారత్పై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. పలు ఉత్పత్తులపై 50శాతం, మరికొన్నింటిపై వంద శాతం టారిఫ్లు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సఫలమైతే సుంకాలు తగ్గే అవకాశం ఉంది. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. చర్చలు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.
Donald Trump | మోదీ నా స్నేహితుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గొప్ప వ్యక్తి అని, ఆయన నా స్నేహితుడు అని ట్రంప్ ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి వచ్చే ఏడాది తాను భారత్ వెళ్లవచ్చన్నారు. మోదీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం చాలావరకు మానేశారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. అమెరికాతో చర్చలపై ఇటీవల భారత వాణిజ్య శాఖ మంత్రి (Indian Commerce Minister) మాట్లాడుతూ.. చర్చలు బాగా జరుగుతున్నాయన్నారు. సున్నితమైన తీవ్రమైన సమస్యలు ఉండడంతో దీనికి కొంత సమయం పడుతుందన్నారు.
కాగా.. రష్యా భారత్కు (India) తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేస్తోంది. దీంతో దేశ అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి కొంతకాలంగా భారీమొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అయితే అమెరికా (America) ఆంక్షలు విధించినా భారత్ వెనక్కి తగ్గలేదు. అయితే ఇటీవల పలుమార్లు ట్రంప్ భారత్ నుంచి రష్యా ఆయిల్ దిగుమతులు ఆపేసిందని ప్రకటించారు. అయితే భారత్ మాత్రం కొనసాగిస్తూనే వస్తోంది. మరోసారి ట్రంప్ రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు తగ్గించిందని చెప్పారు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.
