అక్షరటుడే, వెబ్డెస్క్ : Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బీసీలను బీజేపీ మోసం చేస్తోందన్నారు. తెలంగాణలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతారని, ఎన్నికలయ్యాక బీసీలను వదిలేస్తారని తెలిపారు.
తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో అంతా కిషన్రెడ్డిదే నడుస్తోందన్నారు. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. కిషన్రెడ్డి రాజ్యమని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్రెడ్డిని ఖరారు చేస్తూ ప్రకటన విడుదలైన అనంతరం రాజాసింగ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై (Kishan Reddy) మరోసారి విమర్శలు గుప్పించారు.
Raja Singh | బీసీ నేతల పరిస్థితేంటి?
తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారని రాజాసింగ్ (Raja Singh)తెలిపారు. ఎన్నికలు ముగియగానే బీసీలను వదిలేస్తారన్నారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బీసీలకు అవకాశం దక్కదని విమర్శించారు. అసలు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటున్న కిషన్రెడ్డి.. బీజేపీలో బీసీల పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ బీజేపీలో బీసీ (BC)లు ఎక్కుడున్నారో కాస్త చెబుతారా కిషన్రెడ్డి అని ఎద్దేవా చేశారు. తాను గతంలో ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదని, హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు. కానీ నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తోందని, అందుకు కారణం మీరేనని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి, బీసీ సమాజాన్ని మీరు మోసం చేస్తున్నారని, అందుకే ఈరోజు తాను మాట్లాడాల్సి వస్తోందన్నారు. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన లంకల దీపక్రెడ్డికి రాజాసింగ్ అభినందనలు తెలిపారు.