అక్షరటుడే, వెబ్డెస్క్ : Urea | ఆ ఎమ్మెల్యే కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపించారు. అంతకంటే ఘనంగా రిసెప్షన్ చేద్దామని భావించారు. అయితే దానిని రద్దు చేసి ఆ డబ్బులను రైతులకు యూరియా కోసం ఇచ్చారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Miryalaguda MLA Lakshma Reddy) తన కుమారుడు సాయి ప్రసన్న రిసెప్షన్ మిర్యాలగూడలో నిర్వహించాలని భావించారు. అయితే దాన్ని రద్దు చేసుకుని ఆ డబ్బును రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి, రూ.2 కోట్ల చెక్కును అందించారు. తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఆ డబ్బులతో ఒక్కో యూరియా బస్తా (Urea Bag) ఉచితంగా ఇవ్వాలని ఆయన కోరారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ పాల్గొన్నారు. రైతులకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు.
Urea | గన్మన్ దొరికిపోవడంతో..
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గన్మన్ ఇటీవల యూరియాను అక్రమంగా ట్రక్కులో తరలిస్తుండగా పట్టుబడ్డాడు. దీంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ వైపు రైతులు యూరియా కొరత (Urea Shortage)తో ఇబ్బందులు పడుతుంటే.. ఎమ్మెల్యే గన్మన్ లారీ బస్తాలను తీసుకెళ్లడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు సైతం ఎమ్మెల్యేపై విమర్శలు చేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అయితే గన్మన్ లారీ యూరియా తీసుకెళ్తే.. ఎమ్మెల్యే గోదాం ఖాళీ చేసి ఉంటారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు బ్లాక్మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే గన్మన్ దొరికి పోవడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే రూ.రెండు కోట్లు ముఖ్యమంత్రికి అందించినట్లు తెలుస్తోంది.