అక్షరటుడే, కామారెడ్డి: అదృశ్యమైన వ్యక్తి హత్య చేయబడిన కేసుకు సంబంధించి పోలీసుల విచారణ(police investigation)లో కీలక విషయాలు బహిర్గతమయ్యాయని కామారెడ్డి సబ్ డివిజన్ ఎఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy) తెలిపారు. ఈమేరకు ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు.
రామారెడ్డి పోలీస్ స్టేషన్(Ramareddy Police Station) పరిధిలోని ఇసన్నపల్లికి చెందిన గొల్ల తిరుపతి(45) గత ఏడాది కాలం నుంచి కనిపించకపోవడంతో అతని అన్న గొల్ల నాగమల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు(Missing Case) నమోదైంది. ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఆదేశాలతో ఎఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో విచారణ బృందం ఏర్పాటు చేశారు.
పోలీసుల విచారణలో మిస్సింగ్ కేసు హత్య కేసుగా గుర్తించగా అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో గల్ఫ్ దేశం(Gulf Country)లో పనిచేసిన గొల్ల తిరుపతి ఇటీవల తన గ్రామానికి తిరిగొచ్చాడు. దాంతో అతని భార్య మనెవ్వకు అదే గ్రామానికి చెందిన కందూరి లింబయ్య(తాజా మాజీ సర్పంచి భర్త)తో ఏర్పడిన అక్రమ సంబంధం(Illigal Relationship) అడ్డంకిగా మారింది. దీంతో కందూరి లింబయ్య తన స్నేహితులు అయిన షేక్ హయ్యత్ అలియాస్ భాషా, దర్ని లింబయ్యకు తిరుపతిని హత్య చేయడానికి డబ్బులు ఇచ్చాడు.
ఈ నలుగురు కలిసి పథకం ప్రకారం.. ఫిబ్రవరి 19, 2024న రాత్రి మందు తాగుదామని చెప్పి, తిరుపతిని కారులో ఎక్కించుకుని దర్పల్లి మండలం(Dharpalli mandal) డొంకల్ గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తిరుపతికి మందు తాగించి మత్తులో ఉన్న సమయంలోనే తిరుపతి మెడకు టవల్ తో గట్టిగా లాగి హత్య చేశారు. అనంతరం వెంట తీసుకెళ్లిన పెట్రోల్(Petrol) పోసి శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా తగులబెట్టారు.
మరుసటి రోజు కాలిపోయిన ఎముకలను అక్కడే గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. నిందితులు చూపిన ఆధారాలతో తహసీల్దార్(Tehsildar) ఆధ్వర్యంలో గురువారం మృతునికి సంబంధించిన అవశేషాలు బయటకు తీశారు. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని ఏఎస్పీ(ASP) తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్యకు వాడిన కారు, రెండు మోటార్ సైకిళ్లు, 3 సెల్ఫోన్లు, 10 వేల నగదు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.