అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Update | భారత వాతావరణ శాఖ(Meteorological Department) తీపికబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఆదివారం నాటికి అవి కేరళలోకి ప్రవేశించనున్నాయని వెల్లడించింది. గత రెండు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నందున రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని పేర్కొంది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా భారీ నుంచి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశముందని అంచనా వేసింది. “రాబోయే 2 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సలహాలను పాటించండి. జిల్లాల వారీగా హెచ్చరికలను తనిఖీ చేయండి” అని త్రివేండ్రంలోని వాతావరణ కార్యాలయం(Meteorological Office) తెలిపింది.
Weather Update | ముందస్తుగానే రుతుపవనాలు
ఈసారి భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) కేరళలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఇవి ఆదివారమే కేరళను తాకే అవకాశముందని పేర్కొంది. అదే జరిగితే ముందస్తుగా రుతుపవనాలు రావడం 2009 తర్వాత ఈసారి మాత్రమేనని పేర్కొంది. 2009లో మే 23వ తేదీ రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. 1975 నుంచి పరిశీలిస్తే కేరళలో రుతుపవనాలు ప్రారంభమైన తొలి తేదీ 1990లో (మే 19, 1990), ఇది సాధారణ ప్రారంభ తేదీ కంటే 13 రోజులు ముందు కావడం గమనార్హం. వాతావరణ శాఖ తొలుత మే 27 నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది, అయితే, గత సంవత్సరం కంటే ఐదు రోజులు ముందుగానే ఇప్పుడు ఆదివారమే వచ్చే అవకాశముందని తెలిపింది. 2024లో రుతుపవనాలు మే 30న కేరళను తాకాయి. “పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రుతుపవనాలు షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతున్నాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మేము అంచనా వేసిన విధంగా మే 25 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు.