అక్షరటుడే, వెబ్డెస్క్ : HMWS SB | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) ఎంతోమంది ప్రజలు జలమండలి ద్వారా సరఫరా అయ్యే నీటిని తాగుతారు. అయితే కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించారు. కలుషిత నీరు సరఫరాతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా (water pollution-free city) తీర్చి దిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.
కలుషిత నీరు ఫిర్యాదులను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం ఖైరతాబాద్ (Khairatabad) ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వివిధ కారణాలతో ప్రతినిత్యం కలుషిత నీరు ఫిర్యాదులు నమోదు అవుతాయని, వెంటనే అధికారులు స్పందించి.. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఏయే ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయో, తరచూ నమోదవుతున్న ఫిర్యాదుల ప్రాంతాల వివరాలను సేకరించి సమస్య మూలాలను విశ్లేషించాలని ఆదేశించారు.
HMWS SB | పైప్లైన్లను మార్చాలి
కాలం చెల్లిన పైపు లైన్ల వివరాలు సేకరించాలని ఎండీ సూచించారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఫిర్యాదులు అందే ప్రాంతాల్లో అవసరం అయితే పైప్లైన్లను మార్చాలని ఆదేశించారు. కాలం చెల్లిన పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్ల నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రానున్న రెండు నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సిద్ధం కావాలన్నారు. జలమండలి ఇప్పటికే కలుషిత నీరు, లీకేజీలు అరికట్టడానికి రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే పొల్యూషన్స్ ఐడెంటిఫికేషన్ అనే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఎండీ వివరించారు.