అక్షరటుడే, వెబ్డెస్క్ : Budget 2026 | చిన్న, సన్నకారు రైతుల (farmers) ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) తెలిపారు. వ్యవసాయ రంగంలో ఏఐకి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
దేశంలోని 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. పశు సంవర్ధక శాఖలో (animal husbandry sector) భారీగా ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం ఇస్తామని వెల్లడించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్లు నాటడానికి ప్రోత్సాహం ఇస్తామన్నారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం తీసుకు వస్తామని ప్రకటించారు.
Budget 2026 | మహిళలకు ఆర్థిక సాయం
మహిళల ద్వారా ప్రత్యేక ‘షీ మార్ట్స్’ బజార్ల ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ఏర్పాటుకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. 21వ శతాబ్దం టెక్నాలజీదేనని మంత్రి పేర్కొన్నారు. ఏఐ మిషన్కు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఏఐతో విద్యార్థులు, రైతులకు ఉపయోగపడే ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
Budget 2026 | హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి
దేశంలో హైస్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ముంబై నుంచి పూణె, పూణె నుంచి హైదరాబాద్, హైదరాబాద్ –బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగుడి బెంగళూరు– చెన్నై మధ్య కారిడార్లు డెవలప్ చేస్తామన్నారు. దేశంలోని నగరాల మధ్య కనెక్టివిటీ పెంచటం, మెరుగైన రవాణా వసతులు కల్పించటం లక్ష్యంగా అదనపు కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు.
Budget 2026 | స్థానిక ఉత్పత్తులకు మద్దతు
మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్ పథకం ద్వారా స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇస్తామని నిర్మలమ్మ తెలిపారు. ఖాదీ, చేనేత, హస్త కళల రంగాలకు ప్రోత్సహకాలు ఇస్తామని చెప్పారు. వీటికి అంతర్జాతీయ బ్రాండింగ్ మద్దతు కల్పిస్తామని వెల్లడించారు. ఖాదీ, చేనేత, హస్త కళల్లో యువతకు నైపుణ్య శిక్షణ, నాణ్యత ప్రమాణాలు పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గ్రామీణ కార్మికులు, యువతకు శిక్షణ ఇస్తామన్నారు.
Budget 2026 | కంటైనర్ తయారీకి రూ.10 వేల కోట్లు
ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల కేటాయింపుతో కంటైనర్ తయారీ కోసం ఒక పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. పోర్టులు, రైల్వే కనెక్టివిటీ కింద ఈ నిధులు కేటాయిస్తామన్నారు. తీర ప్రాంతాల్లో పోర్టులు బలోపేతం చేయటం, షిప్పింగ్ వాటా పెంపునకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వారణాసి, పాట్నాలో ఓడల మరమ్మతు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.