అక్షరటుడే, వెబ్డెస్క్ : Bareilly Mayor | ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు చిహ్నంగా నిలుస్తుంది సోదర సోదరీమణుల బంధం. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగినా.. అల్లరి చేస్తూ గడిపినా.. కష్టాల్లో తోడుగా నిలిచినా కూడా ఈ ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది.అయితే నేడు రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) కావడంతో దేశ వ్యాప్తంగా ఈ వేడుకలు అంబరాన్నంటుతన్నాయి. అక్క, చెల్లెళ్లు తమ సోదరులకి రాఖీలు కట్టి ప్రేమని చాటుకుంటున్నారు. అయితే రాశీ పౌర్ణమి రోజు మనకు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) నటించిన ‘రాఖీ’ సినిమా గుర్తు రాకుండా ఉండదు. అందుకు కారణం ఆ సినిమాలో ఎన్టీఆర్ చేతినిండా రాఖీలు కట్టించుకుని, అక్కచెల్లెళ్లకు రక్షణగా నిలుస్తుంటాడు.
Bareilly Mayor | 20 వేల రాఖీలతో..
అయితే ఎన్టీఆర్ చేతినిండా ఉన్న రాఖీలు చూసి అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. అసలు ఇన్ని రాఖీలు ఎవరైన కట్టించుకుంటారా అని అనుకున్నారు. కాని ఇప్పుడు అదే తరహాలో ఓ వాస్తవిక సంఘటన ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) చోటుచేసుకోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. బరేలీ మేయర్ డాక్టర్ ఉమేష్ గౌతమ్ (Umesh Goutham) ఈ రాఖీ పండుగను ఎంతో ప్రత్యేకంగా మార్చుకున్నారు. గత మూడు రోజులుగా నగరం నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి వందలాది మహిళలు ఉమేష్కు రాఖీలు కట్టేందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చేతికి ఏకంగా 20,000 రాఖీలు కట్టించుకుని ఓ అరుదైన రికార్డు సృష్టించారు.
రాఖీలు కట్టిన ప్రతి చెల్లెలికి ఊహించని గిఫ్ట్లు (Gifts) ఇచ్చారు ఉమేష్ గౌతమ్. మిషన్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించే స్పెషల్ హెల్త్ కార్డు,ఇంటర్మెడియట్ వరకు ఉచిత విద్య, రేషన్ కార్డు లేనివారికి నెల నెలా రేషన్ అందిస్తామంటూ హామీ ఇచ్చారు. తన చెల్లెళ్ల కోసం నిస్వార్థంగా పనిచేయడమే తన ధ్యేయమని చెప్పిన ఆయన, ఈ పండుగను ఒక ఎమోషనల్ సంఘటనగా మార్చేశారు. రాఖీలు కడుతున్న సమయంలో కొందరు మహిళలు, తాము అన్నదమ్ములు లేని వాళ్లమని, అందుకే మిమ్మల్నే మా సోదరుడిగా భావిస్తున్నామని చెప్పడంతో ఉమేష్ గౌతమ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందభాష్పాలతో స్పందించిన ఆయన, “ఇవన్నీ మాటలు కాదు, చెల్లెళ్ల భద్రత కోసం మనసుపెట్టి పని చేస్తా,” అన్నారు.