అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Encounter | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న సిగ్మా గ్యాంగ్ (Sigma Gang) సభ్యులు నలుగురు మృతి చెందారు.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో బీహార్ (Bihar)కు చెందిన నలుగురు సిగ్మా గ్యాంగ్ సభ్యులు హతమయ్యారు. ఈ గ్యాంగ్ కొంతకాలంగా బీహర్లో నేరాలకు పాల్పడుతోంది. గ్యాంగ్ కీలక సభ్యుడు రంజన్ పాఠక్ (25)తో పాటు సభ్యులు బిమ్లేష్ మహతో (25), మనీష్ పాఠక్ (33) అమన్ ఠాకూర్ (21) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్- బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టి నిందితులను ఎన్కౌంటర్ చేశారు. వీరిలో అమన్ ఠాకూర్ ఢిల్లీలోని కార్వాల్ నగర్ నివాసి కాగా, మిగిలిన వారు బీహార్లోని సీతామర్హికి చెందినవారు.
Delhi Encounter | కాల్పులు జరపడంతో..
ఈ గ్యాంగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక పెద్ద నేర కార్యకలాపాలకు ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు రోహిణిలో వారిని పట్టుకోవడానికి వల పన్నారు. ఈ క్రమంలో గ్యాంగ్స్టర్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు చనిపోయారు. బీహార్లోని హై ప్రొఫైల్ కేసుల్లో వీరు మోస్ట్ వాంటెడ్ అని పోలీసులు తెలిపారు. ముఠాకు కీలక సూత్రధారి అయిన రంజన్ పాఠక్ బీహార్, పరిసర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో వ్యవస్థీకృత క్రిమినల్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Delhi Encounter | కిరాయి హంతకులు
బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్న నేపథ్యంలో గ్యాంగస్టర్లు ఎన్కౌంటర్ కావడం గమనార్హం. దీనిపై బిహార్ డీజీపీ వినయ్ కుమార్ స్పందిస్తూ.. వారు కిరాయి హంతకులని తెలిపారు. ఈ గ్యాంగ్ సిగ్మా అండ్ కంపెనీ పేరుతో నెలకోసారి నేరాలు చేస్తుంటారని చెప్పారు. బీహార్ ఎన్నికలలో వీరి కుట్రలను భగ్నం చేశామని ఆయన పేర్కొన్నారు.
