అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | సింగరేణిలో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బీఆర్ఎస్ నాయకులు మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్వర్మను (Governor Jishnu Dev Varma) కలిశారు. సింగరేణి కాలరీస్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మెమోరాండం సమర్పించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
గవర్నర్ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో అవినీతిని హరీష్ రావు (Harish Rao) ఆధారాలతో సహా బయటపెట్టడంతో కాంగ్రెస్లో వణుకు మొదలైందన్నారు. దీంతో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి, సిట్ విచారణ (SIT inquiry) పేరిట నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఒకరి తర్వాత ఒకరిని విచారణకు పిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, కోల్ మాఫియాకి నాయకుడు అని ప్రజలు, సింగరేణి కార్మికులు భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | ఫోజులు కొడుతున్న సీఎం
సింగరేణి కుంభకోణంలో తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రావడం లేదన్నారు. స్పందించాల్సిన సీఎం విదేశాల్లో తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని, చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదని ఆయన ఎద్దేవా చేశారు. రూ.10 కోట్ల సింగరేణి నిధులను దుర్వినియోగం చేసి సీఎం ఫుట్బాల్ ఆడటానికి వినియోగించారని కేటీఆర్ అన్నారు.
KTR | ఆ నిబంధన ఎందుకు
టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ నిబంధన ఎందుకు పెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడ ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు తెచ్చారన్నారు. తమ హయాంలో అన్ని టెండర్లను పారదర్శకంగా పిలిచామన్నారు. దీంతో మైనస్ టెండర్లు వచ్చాయని తెలిపారు. సైట్ విజిట్ నిబంధన తెచ్చాక ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు, ఎన్ని లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికేట్లు సింగరేణి సంస్థ జారీ చేసిందనే వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.