అక్షరటుడే, వెబ్డెస్క్: Mary Kom | భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ తన మాజీ భర్తపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media)లో దుమారం రేపిన నేపథ్యంలో తాజాగా వివరణ ఇచ్చారు. ఒక టాక్ షోలో తన మాటలు ఏళ్ల తరబడి అణచిపెట్టుకున్న భావోద్వేగాల ఫలితమేనని, పురుష సమాజాన్ని లేదా ఇతర క్రీడాకారులను అవమానించే ఉద్దేశం తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.ఇటీవల ప్రసారమైన ‘ఆప్ కీ అదాలత్’ (Aap Ki Adalat) కార్యక్రమంలో మేరీ కోమ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ భర్త కె. ఓన్లెర్ కోమ్ గురించి మాట్లాడుతూ “ఏక్ రూపియా భీ నహీ కమాయా” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
Mary Kom | క్షమించండి..
ఆ మాటలు పురుషులను అవమానించేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తడంతో పాటు, ఫుట్బాల్ క్రీడాకారుల కృషిని తక్కువ చేసినట్లుగా భావించి పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన మేరీ కోమ్, “చాలా సంవత్సరాలుగా అణచిపెట్టుకున్న బాధ, నిరాశ, ద్రోహానికి గురయ్యాననే భావన ఒక్కసారిగా బయటకు రావడంతోనే ఆ క్షణంలో అలా మాట్లాడాను. అది ఎవరి మీదా వ్యక్తిగత దాడి కాదు. నా వ్యాఖ్యలు పురుష సమాజం మొత్తాన్ని ఉద్దేశించినవి కావు. ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలి” అని పేర్కొన్నారు. భావోద్వేగంతో పలికిన మాటలను ఒక సిద్ధాంతంగా లేదా సామాజిక వ్యాఖ్యగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు.
తన వైవాహిక జీవితంపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. “మా పెళ్లి పూర్తిగా విఫలమైందని నేను అనను. చాలా కాలం పాటు మా జీవితం సాఫీగానే సాగింది. కానీ నమ్మకం దెబ్బతిన్న తర్వాత పరిస్థితులు మారాయి. 2025 ఏప్రిల్లో విడాకులు తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత కూడా నేను ఎంతో సంయమనం పాటించాను” అని తెలిపారు. వ్యక్తిగత అనుభవాల వల్ల వచ్చిన బాధే ఆ వ్యాఖ్యలకు కారణమని ఆమె చెప్పారు. ఫుట్బాల్ క్రీడాకారులను కించపరిచాననే ఆరోపణలను కూడా మేరీ కోమ్ ఖండించారు. “నాకు ఫుట్బాల్ (Football) అంటే ఎంతో ఇష్టం. సునీల్ ఛెత్రి, బైచుంగ్ భూటియా వంటి క్రీడాకారులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నారు. వారి కృషిని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నా మాజీ భర్త తన ఫుట్బాల్ కెరీర్ను నా కోసం త్యాగం చేశానని చెప్పినా, ఆయన షిల్లాంగ్లో ఫుట్బాల్ ఆడటం మానేసిన చాలా కాలం తర్వాతే ఢిల్లీలో నన్ను కలిశారు” అని స్పష్టం చేశారు.