Kanpur fire accident : ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. కాన్పూర్ చమన్ గంజ్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
భవనంలోని మొదటి అంతస్తుల్లో ఫుట్వేర్ తయారీ(మాన్యుఫ్యాక్చరింగ్) యూనిట్ ఉంది. మిగతా రెండు అంతస్తుల్లో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి, అగ్ని కీలలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
12 అగ్ని మాపక వాహనాల(ఫైరింజన్ల)తో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం పరిశీలించగా.. మూడో అంతస్తులో రెండు మృతదేహాలను గుర్తించినట్లు ఏసీపీ తేజ్ బహదూర్ సింగ్ తెలిపారు. పిల్లల పడక గదులు(బెడ్ రూమ్లు) నాలుగో అంతస్తులో ఉన్నాయి. మృతులను డానిష్ (45), అతని భార్య నజ్మీ సాబాగా గుర్తించారు. అతని ముగ్గురు పిల్లలు కూడా మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
