అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahavatar Narsimha | తెలుగు సినీ రంగంలోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమాలెన్నో ఉన్నాయి. తాజాగా అటువంటి ఓ చిత్రం బాక్సాఫీస్ను బలంగా షేక్ చేస్తోంది. స్టార్ హీరోలు, భారీ డైరెక్టర్, బడా సెట్లు లేకుండానే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తున్న ఈ చిత్రం పేరు ‘మహావతార్ నరసింహ’ (mahavatar narsimha). ఆధ్యాత్మికతతో కూడిన కథనంతో ప్రేక్షకుల హృదయాలను తాకిన ఈ యానిమేటెడ్ చిత్రం, విడుదలైన కొద్ది రోజుల్లోనే అనూహ్యమైన వసూళ్లను రాబడుతోంది. హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన ఎనిమిది రోజుల్లోనే రూ. 60.5 కోట్లు వసూలు చేసి, భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచిందని నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
Mahavatar Narsimha | భారీ వసూళ్లు..
ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. కథన పరంగా ఇది మహావిష్ణువు దశావతారాల ఆధారంగా తెరకెక్కిన సినిమాల్లో మొదటిది. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరిట ఏటా ఒక సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇది దశాబ్ద కాలం పాటు సాగనున్న ప్రాజెక్టుగా ఉంది. గ్రాఫిక్స్ (Graphics), అద్భుతమైన నేపథ్య సంగీతం, పవిత్ర ఇతిహాసాలపై ఆధారపడిన కథా నేపథ్యం సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. భక్తి, భావం, వినోదం మేళవించిన ఈ ప్రయోగాత్మక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సాధారణంగా యానిమేటెడ్ సినిమాలకు ఉన్న పరిమితుల్ని అధిగమించి, ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల పరంగా రికార్డులు నెలకొల్పడం విశేషం. సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ చిత్రం వసూళ్లు ఇంకా కొనసాగుతాయని, త్వరలోనే మరో మెయిన్ స్ట్రీమ్ హిట్గా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విజయం ద్వారా యానిమేషన్ సినిమాలకు (Animation Movies) కూడా కొత్త మార్గం సులువవుతుందనే విశ్వాసం సినీ వర్గాల్లో నెలకొంది. హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయిన తర్వాతి రోజు ఈ మూవీ విడుదలైంది. పవన్ కళ్యాణ్తో పోటీకి దిగిన ఈ సినిమా మంచి ఫలితం అందుకుంది. ఇక రీసెంట్గా కింగడమ్ చిత్రం విడుదలై మంచి హిట్ కొట్టింది. అయినప్పటికీ మహవతార్ నరసింహ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.