అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad City | నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో అధికారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒకవైపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు అనుమతులు జారీ చేసి రూ.లక్షలు దండుకున్నారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ ప్రక్రియలోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి తంతుపై ఏసీబీకి (ACB) వరుస ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో తాజాగా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా సోదాలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ పర్మిషన్లు జారీ చేసిన ఫైల్స్ను పరిశీలించడంతో పాటు వాటిని తమ వెంట తీసుకెళ్లారు. అలాగే ఎల్ఆర్ఎస్ (LRS) ప్రక్రియలో జరిగిన అక్రమాలపై కూడా ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో ఆ కోణంలోనూ విచారణ చేపట్టింది. మోపాల్ మండలం (Mopal Mandal) పరిధిలోని బోర్గాం(పి) గ్రామానికి చెందిన సంబంధించి ఓ అవకతవకల వ్యవహారం ఏసీబీ దృష్టికి వచ్చింది.
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) పేదల భూములను రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ స్కీంను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా.. బోర్గాం(పి) గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తొలుత 253 గజాలకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాడు. ఆ తర్వాత మొత్తం 5 వేల గజాల స్థలాన్ని నగర పాలక సంస్థ అధికారులు ఎల్ఆర్ఎస్ స్కీం కింద రెగ్యులరైజ్ చేశారు. విచిత్రం ఏమిటంటే పైస్థాయి అధికారులకు కూడా ఆమోదం లభించింది. గతంలో పని చేసిన అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని ఇలా ఇష్టారాజ్యంగా అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫైళ్లనింటిని లోతుగా పరిశీలించిన ఏసీబీ అధికారులు (ACB Officers) తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
