అక్షరటుడే, వెబ్డెస్క్: Madhya Pradesh Minister | భారత ఆర్మీ అధికారి, కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sophia Qureshi)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా(Madhya Pradesh Minister Vijay Shah)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఖురేషికి క్షమాపణ చెప్పడాన్ని సోమవారం తిరస్కరించిన కోర్టు(Supreme Court).. ఈ విషయంపై సిట్ దర్యాప్తుకు కూడా ఆదేశించింది. విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటీవల తీవ్రంగా మందలించిన న్యాయస్థానం.. తాజాగా ఆయనపై విచారణ జరపాలని ఆదేశించింది. మంత్రి ప్రకటనతో ఆయన మొత్తం దేశం సిగ్గుపడుతోందని సుప్రీం కోర్టు పేర్కొంది. “మీరు ఒక ప్రజాప్రతినిధి. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేం మీ వీడియోను ఇక్కడ ప్రదర్శించాలి.. ఇది సాయుధ దళాలకు ముఖ్యమైన విషయం. మనం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి” అని సుప్రీంకోర్టు పేర్కొంది.
Madhya Pradesh Minister | విచారణను ఎదుర్కోవాల్సిందే..
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో కలిసి ఖురేషి విలేకరులకు వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి షా ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మే 12న ఇండోర్లోని రాయ్కుండ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sophia Qureshi)ని ఉద్దేశించి ఉగ్రవాదుల సోదరి అని అభివర్ణించారు.
కల్నల్ సోఫియా ఖురేషి పట్ల విస్తృతంగా మతపరమైన, లింగపరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్థానిక హైకోర్టు(High Court) ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో కేసు కొట్టివేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు ఇలా వ్యాఖ్యానించడం తగదని, ముందుగా ఖురేషికి క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. విజయ్ షాపై దర్యాప్తునకు ఆదేశించింది. “మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంత్రి కున్వర్ విజయ్ షాపై ఎఫ్ఐఆర్(FIR)ను దర్యాప్తు చేయాలి” అని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, మంగళవారం ఉదయం 10 గంటలలోపు సిట్ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని కోర్టు ఆదేశించింది. దీనికి ఐజీపీ నేతృత్వం వహించాలి, ఇద్దరు సభ్యులు ఎస్పీ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నవారు కూడా ఉండాలని ఆదేశించింది.