అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవార జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుట్టెంగారి మాధవరెడ్డి (Buttengari Madhav Reddy) అనే వ్యక్తి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల (BC reservations) జీవో విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని చూస్తోంది. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను సీఎంకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అందించారు. త్వరలో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సైతం సమాయత్తం అవుతోంది. ఆయా స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఆశావహులు పోటీకి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంతో హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేయడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
BC Reservations | జీవో నంబర్ 9పై అభ్యంతరం
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై మాధవరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (Malkajgiri district) మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన ఆయన గతంలో సైతం రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అప్పటికి ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయలేదు.
దీంతో పత్రిక కథనాల ఆధారంగా పిటిషన్ను స్వీకరించలేమని కోర్టు కోట్టి వేసింది. శుక్రవారం రాత్రి ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. కాగా.. ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో అని అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ జీవో కోర్టు ముందు నిలబడుతుందా.. రిజర్వేషన్ల పరిమితి 50శాతం మించిందని కోర్టు కొట్టివేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.