అక్షరటుడే, వెబ్డెస్క్ : Bihar Results | బీహార్లో ప్రతిపక్ష మహఘట్బంధన్ (MGB) కూటమి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్రంలో అధికారం చేపట్టాలని కలలు కంటున్న కాంగ్రెస్ను బీహార్ ప్రజలు తిరస్కరించారు. 61 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఆరు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీహార్ ఓటమిపై కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. ఈ ఓటమి ఒక గుణపాటం కావాలని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్లో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ (Congress)తో పాటు విపక్ష ఇండియా కూటమి కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని డీకే శివకుమార్ అన్నారు. తాజా ఓటమి తమకు ఓ గుణపాఠం అని ఆయన అభివర్ణించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు ప్రజల నిర్ణయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. “ప్రజలు ఈ తీర్పును ఇచ్చారు. ఇది మాకు ఒక పాఠం. భవిష్యత్తులో మనం కాంగ్రెస్, ఇండియా కూటమికి కొత్త వ్యూహాన్ని రూపొందిస్తామని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు.
Bihar Results | పని చేయని రాహుల్ ఆరోపణలు
బీహార్లో గెలుపు కోసం రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. ఓటు చోరీ పేరిట పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటు చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అంతేగాకుండా బీహార్లో ఓటరు అధికార్ యాత్ర కూడా చేపట్టారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీహార్ ప్రజలు నమ్మలేదు. ఎంజీబీ కూటమిని తిరస్కరించారు. ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఆరు స్థానాలకు పరిమితం కావడం గమనార్హం.
