అక్షరటుడే, వెబ్డెస్క్ : Kummera Mallanna Jatara | నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా సాగుతోంది. ఈ క్రమంలో స్వామి వారి దర్శనం కోసం గ్రామానికి చెందిన గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, బంధువు చంద్రకళతో కలిసి వెళ్లారు. బుధవారం రాత్రి లైన్లో ఉండగా.. టికెట్ ధర విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి, చంద్రకళకు మధ్య వివాదం మొదలైంది. దీంతో తోపులాట చోటు చేసుకోగా.. మౌనిక తన చిన్నారితో సహా కిందపడిపోయింది. ఈ ఘటనలో రెండు నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం చిన్నారి మృతి చెందింది. దీంతో కాంగ్రెస్ నాయకుల తీరుతోనే తమ కుమార్తె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
Kummera Mallanna Jatara | పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
కుమ్మెర మల్లన స్వామి జాతరలో చిన్నారి మృతిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చిన్నారిని హత్య చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి (Marri Janardhan Reddy) ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. నాగర్ కర్నూల్ నుంచి సంఘటన జరిగిన కుమ్మెర గ్రామానికి పాదయాత్రగా వెళ్లారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే అని ఆయన ఆరోపించారు.
Kummera Mallanna Jatara | ఖండించిన కవిత
కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దాడిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పామని తెలిపారు. దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. పసి పాప మృతికి కారణమైన వారి పై BNS 106(1), BNS 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె నాగర్ కర్నూల్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు.
