అక్షరటుడే, వెబ్డెస్క్ : Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సునీత, కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం, ఆస్తులపై విచారణ జరపడం లేదన్నారు.
గోపీనాథ్ (Maganti Gopinath) మృతిపై ఇటీవల ఆయన తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ ఉప ఎన్నికల్లో భాగంగా పలు కాలనీల్లో ఆదివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే ఆస్తులపై ఆయన భార్య సునీతతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. గోపీనాథ్ ఆస్తులు కాజేసేందుకు బీఆర్ఎస్ (BRS) యత్నిస్తోందని ఆరోపించారు. మాగంటి సునీత పేరు మీద రెండు ఓటరు కార్డులు ఉన్నాయన్నారు. ఒకదాంట్లో భర్త పేరు సునీత మనోహర్ అని ఉందని, మరో దాంట్లో మాగంటి గోపీనాథ్ అని ఉందని చెప్పారు. ఆ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నానని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తన కుమారుడిని చూడనీయకుండా గోపీనాథ్ తల్లిని కేటీఆర్ (KTR) అడ్డుకున్నారన్నారు. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యంతో నోటీసులు ఇప్పించారని ఆయన ఆరోపించారు. గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు అంత్యక్రియలకు రాకుండా.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బెదిరించారన్నారు.
Bandi Sanjay | రేవంత్రెడ్డి సైతం..
గోపీనాథ్ ఆస్తులను కాజేయడానికి కేటీఆర్తో పాటు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కుట్ర పన్నారని బండి సంజయ్ విమర్శించారు. అందుకే ఆయన మృతిపై విచారణ జరపడం లేదన్నారు. గోపీనాథ్ను చూడటానికి తల్లిని అనుమతించలేదన్నారు. అదే ఆస్పత్రిలో మాజీ మంత్రి కేటీఆర్, మాగంటి సునీత తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెర తీశారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో (Jubilee Hills Elections) బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజల ఆస్తులను కాజేస్తుందన్నారు. 20 శాతం ముస్లింల కోసం పాకులాడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు హిందువుల ఓటు బలం చూపించాలని ఆయన కోరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
