అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేయడంతో కొద్ది గంట్లలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
స్థానిక ఎన్నికలు (Local Elections) త్వరలో జరగనుండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బాకీ కార్డులు విడుదల చేసింది. తెలంగాణ భవన్లో (Telangana Bhavan) శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేయకుండా ఎగ్గొట్టిన హామీలపై కార్డులు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ కార్డులు విడుదల చేశారు.
KTR | మహిళలకు రూ.55 వేలు ఇవ్వాలి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతినెలా మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిందని కేటీఆర్ (KTR) గుర్తు చేశారు. ఈ లెక్కన 22 నెలల పాలనలో ఒక్కో మహిళకు రూ.55 వేలు ప్రభుత్వం బాకీ పడిందని విమర్శించారు. రేవంత్రెడ్డి ఎన్నికల ముందు రజినీకాంత్ లాగా మాట్లాడి.. తర్వాత గజినీకాంత్లా మారిపోయారని ఎద్దేవా చేశారు. వృద్ధులకు పెన్షన్ నెలకు రూ. 4 వేల చేస్తామన్నారని, ఆ లెక్కన ఒక్కొక్కరికి రూ.రూ.44 వేలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) బాకీ పడినట్లు పేర్కొన్నారు. ఈ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. తాము కేసులకు భయపడమని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | ప్రభుత్వానికి కాలం దగ్గర పడ్డది
రేవంత్రెడ్డి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలకు రిబ్బన్ కట్ చేస్తున్నారని, అలాగే కేసీఆర్ అమలు చేసిన పథకాలకు కోత పెడుతున్నారని హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తామని, అప్పుడు ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డదని ఆయన అన్నారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ.. కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, ఉద్యమకారులకు 250 గజాల స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రభుత్వం బాకీ పడిందన్నారు.
KTR | చరిత్రలో చూడలేదు
డీజీపీకి నియామక పత్రం ఇవ్వడం చరిత్రలో చూడలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రచారం కోసం డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చారన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అలవాటులో డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, పద్మారావు గౌడ్, మధుసూదనాచారి, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.