అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR on Mallanna Jathara | నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న (Kummera Mallanna) జాతరలో కుల వివక్ష కారణంగా దాడి చేయడం, ఆ ఘటనలో రెండు నెలల చిన్నారి మృతి చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు.
కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా గ్రామానికి చెందిన గణేశ్, మౌనిక దంపతులు తమ రెండు నెలల కుమార్తెతో కలిసి దర్శనానికి వచ్చారు. దర్శనం లైన్లో వారితో ఆలయ నిర్వాహకులు గొడవకు దిగారు. అనంతరం మౌనికను తోసివేయగా.. ఆమె కూతురు తీవ్రంగా గాయపడి చనిపోయింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల అహంకారంతో పసిపాప ప్రాణాలు తీశారన్నారు. దైవ దర్శనానికి వెళ్లిన వారిపై కులం పేరుతో దాడి చేయడమే కాకుండా.. వారిపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు.
KTR on Mallanna Jathara | అధికార పార్టీకి అండగా పోలీసులు
రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని కేటీఆర్ (KTR) మండిపడ్డారు. పసికందు మృతికి కారణమైన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హంతకుడు ఏ పార్టీ వాడైనా ఖచ్చితంగా శిక్షించాల్సిందే అన్నారు. రెండు నెలల పసిపాపను హత్య చేసిన ఎనిమిది మందిని హత్యానేరం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. 21వ శతాబ్దంలో కూడా కులాలు, మతాలంటూ అవమానించడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి బీఆర్ఎస్ (BRS) తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేసి, రూ.10 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
