అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో బండి సంజయ్ తనపై నిరాధర ఆరోపణలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో లీగల్ నోటీసులు పంపినప్పటికీ ఆయన స్పందించలేదన్నారు. దీంతో తనకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని దావా వేశారు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని.. తదుపరి పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కేటీఆర్ కోర్టును కోరారు. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, మీడియా పోర్టల్ల నుంచి తన పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
KTR | బండి సంజయ్ ఏమన్నారంటే..
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్పై మొన్నటి వరకు సిట్ అధికారులు విచారణలో దూకుడు కనబరిచిన విషయం తెలిసిందే. నిందితులతో పాటు ట్యాపింగ్కు గురైన బాధితులను విచారించారు. వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఆగస్టులో విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై పలు ఆరోపణలు చేశారు. కేటీఆర్ తన ఎమ్మెల్యేలు, మంత్రులు, కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు.
KTR | లీగల్ నోటీసులు పంపినా..
బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినా కేటీఆర్ ఆగస్టు 11న లీగల్ నోటీసులు (Legal Notice) పంపారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టుకు లాగుతానని అప్పుడే చెప్పారు. అయితే కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. దీంతో తాజాగా కేటీఆర్ సిటీ సివిల్ కోర్టు (City Civil Court)లో పరువు నష్టం దావా వేశారు.