అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR comments | పాలన చేతకాని కాంగ్రెస్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబరు 5) బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పీకర్కు సూచించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు స్పీకర్ పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా అందజేశారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస్రెడ్డి (Pocharam Srinivas Reddy) అనంతరం కాంగ్రెస్లో చేరారు.
పోచారం వ్యవసాయ సలహాదారు పదవి కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన స్థానాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR comments | మరోసారి కోర్టుకు వెళ్తాం
మూడు నెలల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
పోచారం ఎమ్మెల్యే పదవి పోయే వరకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 21 నెలల పాలనలోనే ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల్లోనే రూ. 2.20 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పు చేసిందన్నారు. హామీలు అమలు చేయడంతో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
KTR comments | అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్
ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, గత ప్రభుత్వం అప్పులు చేసిందని కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసినట్లు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
21 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.2.20 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. ఆ అప్పులతో ఏ ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు.