అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajagopal Reddy | కాంగ్రెస్ పార్టీలో (Congress party) విబేధాలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) కొంతకాలంగా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన భాష మార్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో రాజగోపాల్ రెడ్డి బుధవారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు.
Rajagopal Reddy | తెలంగాణను దోచుకుంటున్నారు
సీఎం రేవంత్రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని రాజగోపాల్రెడ్డి అన్నారు. గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలని హితవు పలికారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లు (Seemandhra contractors) తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన 20 మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
Rajagopal Reddy | మూడున్నరేళ్లే రేవంత్ సీఎం
సీఎం రేవంత్రెడ్డి ఇంకా మూడున్నర ఏళ్లే పదవిలో కొనసాగుతారని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎవరనేది తర్వాత తెలుస్తుందన్నారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాగా మరో పదేళ్లు తానే సీఎం అని ఇటీవల రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం రాజగోపాల్రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే.
Rajagopal Reddy | అధిష్టానం హామీ ఇచ్చింది
తనకు మంత్రి పదవి విషయంలో అధిష్టానం (high command) హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందుకే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు చెప్పారు. అయితే ఆ విషయం తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి (Komatireddy Venkat Reddy) తెలియదన్నారు. తనకు పదవుల కంటే మునుగోడు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారని వ్యాఖ్యానించారు.
Rajagopal Reddy | బీఆర్ఎస్ ఫ్రస్టేషన్లో ఉంది
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారంలో కోల్పోయిన ఫ్రస్టేషన్లో ఉందని రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో (Kaleshwaram project corruption) బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలలని రాజగోపాల్రెడ్డి అన్నారు.
Rajagopal Reddy | సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు
సోషల్ మీడియా జర్నలిస్టులపై (social media journalists) ఇటీవల రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారిని కట్టడి చేయాలని ఆయన అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఖండించారు. సోషల్ మీడియా జర్నలిస్ట్లకు ఆయన మద్దతు తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు నది దాటే వరకు ఓడ మల్లన్న.. నది దాటాకా బోడ మల్లన్నలా ఉందని వ్యాఖ్యలు చేశారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
Rajagopal Reddy | చర్యలు ఉంటాయా
రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం ఆయనకు మొండి చెయ్యి చూపింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో వాకటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, గడ్డం వివేక్లకు మంత్రి పదవులు ఇచ్చింది. అప్పటి నుంచి రాజగోపాల్రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల (BC reservation) ధర్నాకు సైతం ఆయన వెళ్లలేదు. ఈ క్రమంలో ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందా.. లేక బుజ్జగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.