అక్షరటుడే, వెబ్డెస్క్: Khammam House Demolition | ఖమ్మం జిల్లా (Khammam District)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు.ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం (Raghunathapalem Mandal) వి వెంకటాయపాలెం సమీపంలోని 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా పలువురు నివాసం ఉంటున్నారు.
దాదాపు 600 మంది ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు గుడిసెలు వేసుకొని జీవిస్తుండగా.. మరికొందరు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ భూమిపై కొంతకాలంగా కోర్టులో వివాదం నడుస్తోంది. ఇటీవల కోర్టు సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం అధికారులు రంగంలోకి దిగారు.
Khammam House Demolition | భూదాన్ భూములు
వి వెంకటాయపాలెం (V Venkatayapalem) సమీపంలోని భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు పోలీసుల సాయంతో వచ్చారు. పెద్ద ఎత్తున జేసీబీలతో తెల్లవారుజామున చేరుకున్నారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు మోహరించారు. అయితే స్థానికులు వారితో వాగ్వాదం చేశారు. తాము ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఖాళీ చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. అయితే పోలీసులు వారిని పక్కకు తప్పించి కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించడంతో హైటెన్షన్ నెలకొంది.బాధితులు మాట్లాడుతూ.. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని అర్ధంతరంగా వెళ్లిపోమ్మంటే తమ బతుకు ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుకునేందుకు పలువురు యువకులు ప్రయత్నించారు. పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, తమకు పట్టాలు ఇవ్వాలని వారు పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కూల్చివేతలు చేపట్టింది.
