అక్షరటుడే, వెబ్డెస్క్: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. డెత్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చే ఎక్స్గ్రేషియాను దాదాపు రెట్టింపు చేసింది. దీనికి సంబంధించిన సర్క్యులర్ను జారీ చేసింది.
అయితే ఇది అందరికీ కాదు.. సెంట్రల్ బోర్డ్ ఉద్యోగులకు (Central Board Employees) మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ పరిహారం రూ. 8.8 లక్షలుగా ఉంది. దీనిని రూ. 15 లక్షలకు పెంచారు. ఉద్యోగి సర్వీస్లో ఉండగా చనిపోతే అతడి నామినీలకు ఈ మొత్తం అందుతుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఈ పరిహారం (Ex Gratia) అందించనున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఎక్స్గ్రేషియా మొత్తాన్ని ఏటా 5 శాతం చొప్పున పెంచనున్నట్లు ఈపీఎఫ్వో (EPFO) ప్రకటించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా కంపెనీల యాజమాన్యాలు, ఉద్యోగుల నుంచి ప్రతినిధులు ఉంటారు. ఈపీఎఫ్వోకు సంబంధించిన తుది నిర్ణయాలు తీసుకునేది ఈ బోర్డే..
EPFO | గత వారంలోనూ పలు మార్పులు..
ఈపీఎఫ్వో గతవారంలోనూ పలు కీలక మార్పులు చేసింది. ఇవి ప్రావిడెంట్ ఫండ్(PF) చందాదారులకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయి. పీఎఫ్ ఖాతాదారుడు మరణించినప్పుడు.. వారి డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సిన విషయంలో క్లెయిమ్ ప్రాసెస్ను సులభతరం చేశారు. అంతకుముందు కచ్చితంగా గార్డియెన్షిప్ సర్టిఫికెట్ (Guardianship Certificate) సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. మైనర్ పిల్లల పేరిట బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. పీఎఫ్ సభ్యులు తమ ఆధార్ వివరాలను యూఏఎన్(UAN)తో లింక్ లేదా వెరిఫై చేసే ప్రక్రియ కూడా సులభతరంగా మారింది. జాయింట్ డిక్లరేషన్, కంపెనీ యాజమాన్యం జోక్యం అవసరం లేకుండా మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ సెంట్రల్ బోర్డ్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి.
EPFO | ఇతర రంగాల ఉద్యోగులకు..
సెంట్రల్ బోర్డ్ ఉద్యోగులు కాకుంగా ఇతర రంగాల (Other Sectors) ఈపీఎఫ్ సభ్యులు సర్వీసులో చనిపోతే.. ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా (EDIL) స్కీమ్ కింద కనీసం రూ. 2.50 లక్షల నుంచి గరిష్టంగా రూ. 7 లక్షల వరకు చెల్లిస్తారు. ఈ స్కీమ్ కింద కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగి వేతనం నుంచి 0.5 శాతం చందాగా చెల్లిస్తున్నాయి. ఏడాది కంటే తక్కువ సర్వీస్ ఉంటే కనీస బీమాను రూ. 50 వేలకు పెంచారు.
EPFO | అరకొరగానే పింఛన్..
ఇతర రంగాల ఉద్యోగులకు ఈపీఎఫ్వో పింఛన్ (Pension) అరకొరగానే అందుతోంది. ఉద్యోగుల పింఛన్ పథకం 1995 కింద ప్రతి ఇద్దరిలో ఒక్కరికి నెలకు రూ. 1,500 పెన్షన్ కంటే తక్కువే అందుతోందని ఇటీవల రాజ్యసభలో కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె తెలిపారు. 81.48 లక్షల మంది పెన్షనర్లు ఉండగా.. 53 వేల మందికి మాత్రమే రూ. 6 వేలపైన పింఛన్ అందుతోందని గణాంకాల ద్వారా తెలుస్తోంది.