అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan | పాకిస్తాన్ (Pakistan)లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. పాకిస్తాన్లోని దిర్ (Dhir)లో ఉగ్రవాది హిబ్బతుల్లా అఖుంజాదా ముఫ్తీ హబీబుల్లా హక్కానీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కాగా హబీబుల్లా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ముంబై పేలుళ్ల కుట్రదారి అయిన హఫీజ్ సయీద్ (Hafiz Saeed)కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. గతంలో సైతం పలువురు ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో వరుస ఘటనలతో పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఆందోళన చెందుతున్నారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam)లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) చేపట్టి పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో వంద మంది వరకు ఉగ్రవాదులు మరణించారు. ఇందులో పలువురు కీలక నేతలు ఉన్నారు. తాజాగా గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపుతుండడంతో టెర్రరిస్టుల్లో భయం పట్టుకుంది. తమకు రక్షణ కల్పించాలని వారు పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం.
Pakistan | పతనం అంచున పాక్
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ(Economy) పతనం అంచున ఉంది. ప్రజలకు కనీస వసతులు కల్పించలేని స్థితిలో ఆ దేశం ఉంది. మరోవైపు సొంత సైనికులను సైతం కాపాడుకోలేకపోతోంది. బలూచిస్తాన్ (Balochistan) వేర్పాటువాదుల దాడిలో వందల సంఖ్యలో సైనికులు చనిపోతున్నారు. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. మరోవైప్ దాయాది దేశంలో లీటర్ పెట్రోల్ రూ.266కు, డీజిల్ రూ.272కు చేరింది. దీంతో ప్రజలు ఇప్పటికే పాక్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు భద్రత కల్పిస్తే వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది.