ACB Case
ACB Case | మాజీ ఈఎన్​సీ అక్రమాస్తుల కేసులో వెలుగులోకి కీలక విషయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | నీటి పారుదల శాఖ ఈఎన్​సీగా (Irrigation ENC) పనిచేసి రిటైర్డ్​ అయిన మురళీధర్​రావు అక్రమాస్తుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో (Kaleshwaram Project) కీలకంగా వ్యవహరించిన మురళీధర్​రావు (Muralidhar Rao) భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు జులై 15 ఆయన ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో దాడులు (ACB Raids) చేశారు. ఈ సందర్భంగా భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్​ చేశారు.

ACB Case | కొనసాగుతున్న కస్టడీ

ఏసీబీ అధికారులు రిటైర్డ్​ ఈఎన్​సీని కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్​ విధించారు. అనంతరం వారు ఆయనను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శనివారం నాలుగో రోజు ఆయనను విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా అధికారులు కీలక విషయాలు గుర్తించారు. భారీగా అక్రమాస్తులు సంపాదించిన మురళీధర్​రావు వాటిని తన కొడుకు పేరిట రిజిస్ట్రేషన్​ చేయించాడు. మురళీధర్రావు కుమారుడు సాయి అభిషేక్ ఆస్తులను అధికారులు గుర్తించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో ఆయన పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు తేల్చారు.

ACB Case | పలు కంపెనీల్లో పెట్టుబడులు

మురళీధర్​రావు కుమారుడు తమిళనాడు, ఏపీలోని పలు కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. ఆరు బ్యాంకు లాకర్లలో (Bank Lockers) మూడు లాకర్లకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఓపెన్​ చేశారు. అందులో పలు కీలక డాక్యమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తండ్రి, కొడుకుల ఆస్తులపై కలిపి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఏసీబీ అధికారులకు మురళీధర్ రావు సహకరించడం లేదని తెలుస్తోంది.

ACB Case | మాజీ ఈఎన్​సీ ఆస్తులు

మురళీధర్​రావుకు హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని కొండాపూర్​లో ఒక విల్లా ఉంది. బంజరాహిల్స్​, యూసుఫ్​గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో ఒక్కో ప్లాట్​ ఉన్నాయి. కరీంనగర్, హైదరాబాద్​ నగరాల్లో కమర్షియల్​ భవనాలు ఉన్నాయి. కోదాడలో ఒక అపార్ట్​మెంట్​ ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో సోలార్​ పవర్​ ప్రాజెక్ట్​ ఉండడం గమనార్హం. వరంగల్​లో ఒక అపార్ట్​మెంట్​ నిర్మాణంలో ఉంది. 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో నాలుగు ఓపెన్​ ప్లాట్లు, మోకిలో 6500 చదరపు గజాల స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేగాకుండా మూడు కార్లు, ఇందులో ఒకటి బెంజ్​ కారు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.