HomeతెలంగాణGanesh Chaturthi | ప్రభుత్వం కీలక నిర్ణయం.. గణేశ్​ మండపాలకు ఉచిత విద్యుత్​

Ganesh Chaturthi | ప్రభుత్వం కీలక నిర్ణయం.. గణేశ్​ మండపాలకు ఉచిత విద్యుత్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Chaturthi | మరో మూడు రోజుల్లో వినాయక చవితి (Vinayaka Chaviti) పండుగ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. వాడవాడలా గణనాథులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు.

వినాయక చవితి బుధవారం కాగా.. ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్​ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి నిర్వాహకులు మండపాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మండపాల నిర్వాహకులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్​ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌ (Free Current) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Ganesh Chaturthi | అంగరంగ వైభవంగా..

రాష్ట్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధివీధిన వినాయక మండపాలతో ఎక్కడా చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్​ (Hyderabad) నగరంలో వినాయక చవితి ఘనంగా జరుపుతారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది. నగరంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్​ ఇస్తామని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)​ ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్​ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ganesh Chaturthi | నిమజ్జనం కోసం రూ.30 కోట్లు

హైదరాబాద్​ మహా నగరంలో వినాయక నిమజ్జనం (Ganesha immersion) శోభాయామనంగా సాగుతోంది. వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా రోడ్లు భక్తజనంతో కిక్కిరిసిపోతాయి. దీంతో ప్రభుత్వం నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం రూ.30 కోట్లు కేటాయించింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.