అక్షరటుడే, వెబ్డెస్క్ : Home Minister Amit Shah | కేంద్ర ప్రభుత్వం బుధవారం మూడు కీలక బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. తీవ్ర నేరారోపణలతో అరెస్టు అయి వరుసగా 30 రోజులు జైలులో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ఎన్నికైన ప్రతినిధులను వారి పదవుల నుంచి తొలగించేలా రూపొందించిన బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఈ మేరకు రాజ్యాంగ (130 సవరణ) బిల్లు, 2025, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు, 2025, జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir) పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2025ను లోక్ సభ ముందుకు తీసుకొచ్చారు. అయితే, బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సమాఖ్య వ్యవస్థను నీరుగార్చేలా రూపొందించిన ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ లోక్ సభలో (Lok Sabha) ఆందోళనకు దిగాయి.
Home Minister Amit Shah | జేపీసీ పరిశీలనకు బిల్లులు..
సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee) (జేపీసీ) పరిశీలనకు పంపుతామని అమిత్ షా ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (National Democratic Alliance) (ఎన్డీఏ) ప్రభుత్వం రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరచాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ మేరకు సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. విపక్షాల నిరసనల నడుమ మూడు బిల్లులను ప్రవేశపెట్టడం సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో బిల్లులను ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పంపుతామని షా చెప్పారు.
Home Minister Amit Shah | ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునే..
కేంద్రం తీసుకొచ్చిన తాజా బిల్లులను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర ప్రకారమే బిల్లులు తెచ్చారని మండిపడ్డాయి. మూడు బిల్లులను అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కును దెబ్బతీస్తున్నాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (MP Asaduddin Owaisi) అన్నారు. ఈ బిల్లులు ఆమోదిస్తే కార్యనిర్వాహక సంస్థలకు అంతులేని స్వేచ్ఛను ఇస్తాయని పేర్కొన్నారు. “ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని సృష్టించడానికి నిశ్చయించుకుంది.
ఎన్నికైన ప్రభుత్వానికి మరణశిక్ష విధించేలా ఈ బిల్లులు రూపొందించారు.. ఈ దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చడానికి భారత రాజ్యాంగాన్ని సవరిస్తున్నారని ” అని ఓవైసీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ (MP Manish Tewari) కూడా ఈ మూడు బిల్లులను విమర్శించారు. అవి రాజ్యాంగ విధ్వంసకర బిల్లులు అని, ఇవి కార్యనిర్వాహక సంస్థ వ్యవస్థకు ఎనలేని అధికారాన్నిఆపాదిస్తాయన్నారు. “చట్టబద్ధమైన పాలన ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. దోషిగా నిరూపించబడే వరకు నిర్దోషిగా ఉండాలి. ఈ బిల్లు దానిని మార్చాలని ఆశిస్తోంది” అని ఆయన అన్నారు.
Home Minister Amit Shah | బిల్లు ప్రతుల చింపివేత..
సభ కార్యకలాపాల సమయంలో, కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు మూడు వివాదాస్పద బిల్లుల కాపీలను చించి షా వైపు విసిరారు, ఆ తర్వాత సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సోహ్రాబుద్దీన్ కేసులో షా ‘నైతికత’ను కాంగ్రెస్ ఎంపీ కేసీ కేసీ వేణుగోపాల్ (Congress MP KC Venugopal) ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హోంమంత్రి.. తాను జైలుకు వెళ్లక ముందు రాజీనామా చేశానని గుర్తు చేశారు.
Home Minister Amit Shah | ఈ బిల్లుల లక్ష్యాలు ఏమిటి?
తీవ్రమైన నేరారోపణల కారణంగా అరెస్టు చేయబడి నిర్బంధంలో ఉన్న ముఖ్యమంత్రిని లేదా మంత్రిని తొలగించడానికి కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం, 1963 (1963లో 20) కింద ఎటువంటి నిబంధన లేదని కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు, 2025 చెబుతోంది. అటువంటి సందర్భాలలో ముఖ్యమంత్రి లేదా మంత్రిని తొలగించడానికి చట్టపరమైన అధికారాన్ని అందించడానికి, 1963 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 45కి కేంద్రం సవరణ చేస్తూ బిల్లును తీసుకొచ్చింది.
తీవ్రమైన నేరారోపణల కారణంగా అరెస్టయి నిర్బంధంలో ఉన్న మంత్రిని తొలగించడానికి రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదని రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 లక్ష్యాలు చెబుతున్నాయి. అందువల్ల, ప్రధానమంత్రిని లేదా కేంద్ర మంత్రి మండలిలోని మంత్రిని, రాష్ట్ర మంత్రి మండలి ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని ముఖ్యమంత్రిని లేదా మంత్రిని తొలగించడానికి చట్టపరమైన అధికారాన్ని కల్పించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239AAలను సవరిస్తూ కేంద్రం మరో బిల్లును సభ ముందు పెట్టింది.
తీవ్రమైన నేరారోపణల కారణంగా అరెస్టయిన ముఖ్యమంత్రి లేదా మంత్రిని తొలగించడానికి ఎటువంటి నిబంధన లేదని జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2025 లక్ష్యాలు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 (2019లో 34) చెబుతోంది. అటువంటి సందర్భాలు తలెత్తితే ముఖ్యమంత్రి లేదా మంత్రిని తొలగించడానికి చట్టపరమైన అధికారాన్ని కల్పించేలా జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019లోని సెక్షన్ 54ని సవరించడానికి కేంద్రం మరో బిల్లును సభలో ప్రవేశపెట్టింది.