అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కేసీఆర్ పెద్దగా జనాల్లోకి రావడం లేదనే విషయం తెలిసిందే. అసెంబ్లీకి కూడా ఆయన వెళ్లడం లేదు. పలు సభల్లో మాత్రమే మాట్లాడారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. పబ్లిక్లోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారన్నారు. జనాలకు కూడా కేసీఆర్ విలువ తెలిసిందని వ్యాఖ్యానించారు. ఏడాదిపాటు ప్రభుత్వానికి సమయం ఇచ్చామన్నారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పొద్దున లేస్తే కేసీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు.
KTR | పాదయాత్రకు టైం ఉంది
తాను రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతానని కేటీఆర్ తెలిపారు. అయితే దానికి ఇంకా సమయం ఉందన్నారు. ఎన్నికలకు మూడేళ్లు ఉందని గుర్తు చేశారు. పాదయాత్ర కు తొందరేం లేదన్నారు. ప్రస్తుతానికి స్లిమ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మధ్య జిమ్కు కొంచెం గ్యాప్ ఇచ్చానని, మళ్ళీ స్టార్ట్ చేస్తానని పేర్కొన్నారు.
KTR | ముస్లింల ఓట్ల కోసమే..
మాజీ ఎంపీ అజారుద్దీన్ (Ajaruddin)ను కాంగ్రెస్ ఇటీవల ఎమ్మెల్సీగా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదన్నారు. అజారుద్దీన్ క్రికెట్లో బాగా కట్ లు కొట్టేవారని, ఇప్పుడు ఆయనకే పెద్ద కట్ కొట్టారని ఎద్దేవా చేశారు. అజారుద్దీన్ను సంతృప్తి పరిచేందుకు, ముస్లింల ఓట్ల కోసం ఎమ్మెల్సీ అని ప్రకటించారని కేటీఆర్ అన్నారు.
KTR | ముడుపుల రేవంత్రెడ్డి
ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి అని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్ అండ్ టీ కంపెనీ వాళ్లని ముడుపుల కోసం సీఎం డిమాండ్ చేశారన్నారు. అందుకే వాళ్లు మెట్రో (Metro) నడపకుండా వెళ్లిపోతామని చెప్పారన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ 4 గా గ్రీన్ కో పైన కేసు వేయలేదన్నారు. గ్రీన్ కో దగ్గర ముడుపుల కోసమే వారిపై కేసు లేదని ఆరోపించారు. గతంలో అనేక వివాదాలు ఉన్న ఎమ్మార్ సంస్థ ఆస్తులను రేవంత్ రెడ్డి త్వరలో విక్రయించనున్నారని ఆయన చెప్పారు.
KTR | సీఎం బంధువుల కోసం ..
పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్ఆర్ఆర్ (RRR) దక్షిణం వైపు అలైన్మెంట్ను మార్చారన్నారు. అక్కడ సీఎం రేవంత్రెడ్డి బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారని ఆయన ఆరోపించారు. వారి కోసమే అలైన్మెంట్ మార్చారన్నారు. దీంతో మొత్తం అలైన్మెంట్ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
