అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP | కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, అందులో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (BJP State President Ramachandra Rao) ఆరోపించారు. ఆయన బుధవారం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఏటీఎంలా వినియోగించుకుందన్నారు. కాళేశ్వరం అవినీతి కేసులో రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
BJP | బీజేపీ వైపు నేతల చూపు
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని రామచందర్రావు వ్యాఖ్యానించారు. అచ్చంపల్లి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Former MLA Guvvala Balaraju) ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామచందర్రావు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీలో చేరే నేతలకు ఆహ్వానం పలుకుతామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు ఆయన తెలిపారు.
BJP | సీబీఐతో విచారణ చేపట్టాలి
కాళేశ్వరం ప్రాజెక్ట్లో (Kaleshwaram Project) పక్కా అవినీతి జరిగిందని రామచందర్రావు అన్నారు. అందులో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR), మాజీ మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి, అక్రమాలసై సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.
BJP | నివేదికపై అప్పుడు స్పందిస్తాం..
కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత స్పందిస్తామని రామచందర్రావు ఇదివరకే ప్రకటించారు. పూర్తి నివేదికను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్టీ బలోపేతంపై చర్యలు చేపట్టారు. త్వరలో స్థానిక ఎన్నికలు (Local Elections) జరగనున్న నేపథ్యంలో జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి సూచలను చేస్తున్నారు. మంగళవారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో పర్యటించిన రామచందర్రావు బుధవారం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.