అక్షరటుడే, వెబ్డెస్క్: BRS Chief KCR | అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఒంట్లో నలతగా ఉండడంతో రెండ్రోజుల క్రితం ఆయన సోమాజీగూడ యశోదా ఆస్పత్రి (Somajiguda Yashoda Hospital)లో చేరిన సంగతి తెలిసిందే.
రెండ్రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన కేసీఆర్ కోలుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో డాక్టర్లు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆస్పత్రి నుంచి కేసీఆర్ నేరుగా నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా గురువారం సాయంత్రం కేసీఆర్ యశోదా హాస్పిటల్కు వెళ్లారు. అయితే, వైద్యుల సూచన మేరకు ఆయన అక్కడే అడ్మిట్ అయ్యారు. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి, రెండు రోజులు హాస్పిటల్లో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఆరోగ్యపరంగా కేసీఆర్(BRS Chief KCR)కు పెద్దగా ఇబ్బందులేమీ లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్షల అనంతరం శనివారం ఉదయం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ (Discharge) అయ్యారు.
BRS Chief KCR | ఆస్పత్రిలోనే నేతలతో సమీక్ష..
ఆస్పత్రిలో చేరిన తనను పరామర్శించేందుకు వచ్చిన పార్టీ నేతలతో కేసీఆర్ హాస్పిటల్లోనే సమీక్షించడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీ ముఖ్య నాయకులు శుక్రవారం యశోదా ఆస్పత్రికి తరలి వచ్చారు. దీంతో ఆయన పార్టీ నేతలతో (Party Leaders) రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ఇచ్చిన హామీల ఎగవేత, కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, పార్టీ పరిస్థితులపై ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ‘రాష్ట్రంలో పంటలెట్ల ఉన్నయి? వానలు పడుతున్నాయా? నీళ్లు అందుతున్నాయా?’ అంటూ ఆరా తీశారు. యూరియా కొరతపై నేతలు వివరించగా, బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ (Telangana)కు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా గురించి ప్రభుత్వం చేస్తున్న వితండ వాదన, అర్థం, పర్థంలేని వాదన గురించి చర్చకు రాగా దీనిపై త్వరలోనే తాను స్పందిస్తానని కేసీఆర్ చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన నీటి వాటాపై తానే స్వయంగా స్పందిస్తానని, ఈ మేరకు రెండు, మూడ్రోజుల్లో మీడియా ముందుకు వస్తానని చెప్పారు.