అక్షరటుడే, ఇందూరు: MP Arvind | కల్వకుంట్ల కవిత, సీఎం రేవంత్రెడ్డి (CM Revanth reddy) బిజినెస్ పార్ట్నర్లు అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదని విమర్శించారు.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను గత ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రయత్నించిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ (Fee reimbursement) విడుదలను కేసీఆరే నిలిపేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
MP Arvind | కవిత రాజీనామా చేసినా ఎందుకు ఆమోదించలేదు..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి, కవిత (Kalvakuntla Kavitha) ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదన్నారు. కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి (Gutta Sukhender Reddy) కవిత రాజీనామాను ఆమోదించాలని తమ రాష్ట్ర నాయకురాలు స్రవంతి రెడ్డి లేఖ రాశారని గుర్తు చేశారు. అయినా ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. రాజీనామాను నిలిపే హక్కు ఛైర్మన్కు లేదని స్పష్టం చేశారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు.
MP Arvind | మున్సిపాలిటీలకు ఇచ్చిన నిధులు 80 శాతం కేంద్రానివే..
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (Underground drainage), డ్రింకింగ్ వాటర్ కోసం ఇటీవల రూ.2,332 కోట్లు నిధులు విడుదల చేశారని ఎంపీ తెలిపారు. ఇందులో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆరు మున్సిపాలిటీలకు రూ.169.3 కోట్లు విడుదలయ్యాయన్నారు. అయితే ఇందులో 80శాతం నిధులు కేంద్రానివేనని, 20శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానివని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తామే నిధులు తెచ్చామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
MP Arvind | దీక్ష కోసం ప్రణాళిక..
జిల్లాలోని ఆర్వోబీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. గతంలో తాను చెప్పిన విధంగా తొందర్లోనే మాధవ నగర్ ఆర్వోబీ (Madhava Nagar ROB) వద్ద దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్లో బీజేపీకి మంచి పట్టు ఉందని, జూబ్లీహిల్స్లో కార్యకర్తలు (Jubilee Hills byelection) కూడా బీజేపీ కోసం కష్టపడుతున్నారన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
