అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిలో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ (State Housing Corporation) ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన భిక్కనూరు (Bhikkanoor) మండలం బస్సాపూర్ (Bassapur) గ్రామాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), హౌసింగ్ అధికారులతో కలిసి సందర్శించారు.
మండల కేంద్రంలో ఫిల్టర్ రూప్ టెక్నాలజీ (Filter loop technology) ద్వారా నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ (Indiramma Model House), నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. దోమకొండ (Domakonda) మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.
ఇళ్ల నిర్మాణం సందర్భంగా ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచితంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని, దశలవారీగా నిర్మాణం జరిగిన ఇళ్లకు బిల్లులు వెంటనే లబ్ధిదారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి (kamareddy) జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అన్ని అంశాల్లోనూ.. జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు, జిల్లా అధికారులకు అభినందనలు తెలిపారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఫిల్టర్ రూప్ పద్ధతిలో నిర్మించుకోవడంపై నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా ఇల్లు వేసవి కాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుందన్నారు. లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులను, మేస్త్రీలను తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో చూపించాలన్నారు.
Indiramma Housing Scheme | ఇసుక అనేది ప్రభుత్వ ఆస్తి..
ఇసుక అనేది ప్రభుత్వ ఆస్తి అని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ ఇసుక సరఫరా చేసినా అది చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కలెక్టర్ను ఆదేశించారు. అదే సమయంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక సమస్య రాకుండా హౌసింగ్ అధికారులు తహశీల్దార్, ఎంపీడీవోలతో సమన్వయం చేసుకొని ఉచితంగా ఇసుక టోకెన్లు అందించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ఇసుక రవాణా కోసం ట్రాక్టర్లకు, లేబర్స్, లబ్ధిదారులు ఛార్జీలు చెల్లించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. తద్వారా ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఎక్కువ భారం లబ్ధిదారులపై పడకుండా ఉంటుందన్నారు.
హౌసింగ్ ఇంజినీర్లు ప్రతిరోజూ నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను సందర్శించి లబ్ధిదారులకు సూచనలు, సలహాలు ఇస్తూ నాణ్యతగా ఇల్లు నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. వారం వారం లబ్ధిదారులకు బిల్లును చెల్లించడం జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మట్టి గట్టిగా ఉంటుందని అన్ని ప్రాంతాలలో నిర్మాణానికి పిల్లర్స్ అవసరం లేవని అన్నారు. ప్లింత్ భీమ్ మాత్రమే వేసుకోవాలి తప్ప కాలమ్స్, పిల్లర్స్ వేసుకోవాలని లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అనర్హులుగా తేలితే వారు ఏ స్థాయిలో ఇల్లు నిర్మించుకున్న ఇంటి నిర్మాణం ఆపివేసి సంబంధిత అధికారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లావ్యాప్తంగా 12,090 ఇళ్ల నిర్మాణం లక్ష్యంతో 11,883 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా వాటిలో 5,721 ఇళ్లకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు 2,182 ఇళ్ల బేస్మెంట్ లెవల్ వరకు, 66 ఇళ్ల రూప్ లెవల్ వరకు నిర్మాణం పూర్తికాగా ఒక ఇల్లు నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించారు. 2,111 ఇళ్లకు నిర్మాణ దశను బట్టి బిల్లులు చెల్లించడం జరిగిందని, 431 మంది నిరుపేద లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకునేందుకు ఐకేపీ మహిళా సంఘాల ద్వారా లింకేజీ రుణం అందించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, హౌసింగ్ పిడీ విజయ్ పాల్ రెడ్డి, కామారెడ్డి ఆర్డీవో వీణ, హౌసింగ్ డిఇ సుభాష్, ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.