అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalvakuntla Kavitha | మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha ఇంటరాక్షన్లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె నేరుగా, స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.
వ్యక్తిగత అభిరుచులపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను చిరంజీవికి (Megastar Chiranjeevi) పెద్ద ఫ్యాన్ని అని చెప్పారు. తన ఫేవరేట్ హీరో ఎవరు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. “మెగాస్టార్ చిరంజీవి ఆల్వేస్.. నెక్ట్స్ అల్లు అర్జున్… తగ్గేదేలే” అంటూ జిఫ్ ఇమేజ్ను షేర్ చేయడం వైరల్గా మారింది. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగ్గా.. “చాలా హంబుల్ పర్సన్, మంచి డ్యాన్సర్” అని ప్రశంసించారు.
Kalvakuntla Kavitha | కవిత స్టన్నింగ్ కామెంట్స్..
గతంలోనూ చిరంజీవిపై తన అభిమానాన్ని కవిత పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ‘ఖైదీ నంబర్ 150’ విడుదలకు ముందు “చిరంజీవి 150వ సినిమా కోసం ఎదురుచూసాను. ఒకసారి అభిమాని అయితే ఎప్పటికీ అభిమానిగానే ఉంటాం” అని చెప్పిన వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు మెగా ఫ్యామిలీతో తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కూడా మంచి సంబంధాలు ఉన్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. రాజకీయ అంశాలపైనా కవిత విస్తృతంగా స్పందించారు. సామాజిక తెలంగాణయే (Telangana) తన ధ్యేయమని మరోసారి స్పష్టం చేస్తూ, 2028 ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామన్నారు.
నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. యువత, మహిళలకు రాజకీయంగా, వృత్తిపరంగా అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. త్వరలో జాగృతి మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) పాలనపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు, సింగరేణి నిర్లక్ష్యం, హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. మొత్తంగా #AskKavitha ఇంటరాక్షన్ ట్విట్టర్ పాలిటిక్స్ విభాగంలో నంబర్ వన్గా నిలవగా, కవిత వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా విస్తృత చర్చకు దారి తీశాయి.