అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalvakuntla Kavitha | ఉద్దండాపూర్ భూనిర్వాసితులకు ఎకరాకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను ఆమె మంగళవారం పరిశీలించారు. అనంతరం ఉద్దండాపూర్ (Uddandapur) నిర్వాసిత రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. భూ నిర్వాసితులకు ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదని.. పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందేనని అన్నారు.
Kalvakuntla Kavitha | ప్రజలకు మేలు చేయాలి
ప్రాజెక్టు దాదాపు 80 శాతం పూర్తయిందని, మిగిలిన పని కూడా త్వరగాపూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. తప్పు బీఆర్ఎస్దా, కాంగ్రెస్దా అని కాదన్నారు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారని, వారికి మంచి జరగాలని మాత్రమే తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను ఈ ప్రభుత్వం చేస్తుందా? లేదా? అని ప్రశ్నించారు.
Kalvakuntla Kavitha | తెలంగాణ వచ్చాకే పాలమూరుకు నీళ్లు..
తెలంగాణ (Telangana) వచ్చాక చాలా మంచి పనులు జరిగాయని, అందులో ఎలాంటి సందేహం లేదని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసని గుర్తు చేశారు. వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారన్నారు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా నీటి సౌలత్ మంచిగా చేసుకున్నామని గుర్తు చేశారు. చెరువులు బాగా అయినయని, ఎండాకాలంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో చెరువులు కళకళలాడుతున్నాయ్యారు. కృష్ణా నది నీళ్లను వినియోగించుకోవాలని కేసీఆర్ (KCR) పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారని, ఉద్దండపూర్ రిజర్వాయర్ సహా అన్ని పనులు 80 శాతం వరకు అప్పుడే పూర్తయ్యాయన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి (Revanth Reddy) గెలిచి కూడా రెండేళ్లు అయ్యిందని, ఇప్పటికీ మిగిలిన పనులు పూర్తి చేయటం లేదని విమర్శించారు.
Kalvakuntla Kavitha | అందరికీ న్యాయం చేయాలి..
కోర్టు కేసులు ఉన్నాయని ప్రాజెక్ట్ ను ఆలస్యం చేస్తున్నారని కవిత (Kalvakuntla Kavitha) మండిపడ్డారు. ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందో లేదో కానీ నిర్మాణంలో అయితే స్పష్టంగా నాణ్యత లోపం తెలుస్తోందన్నారు. నిర్వాసితులైన రైతులకు కటాఫ్ ఏజ్ 2021 నాటికే పెడుతున్నారన్నారు. ఇప్పుడు 18 ఏళ్లు ఉన్నవారికి పరిహారం ఇవ్వమంటున్నారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. పరిహారం ఇచ్చే నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలేపల్లి లో ఎకరాకు రూ.12.50 లక్షలు ఇచ్చి… మిగతా ప్రాజెక్టుల ముంపు గ్రామాల ప్రజలకు రూ.6.50 లక్షలు ఇస్తున్నారన్న కవిత.. అందరికీ ఒకటే ధర కట్టి ఇవ్వాలన్నారు. డిసెంబర్ 9వ తేదీలోపు నిర్వాసితులకు ఎకరాకు రూ. 25 లక్షల పరిహారం, ప్యాకేజీ ఇప్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే మాట ఇచ్చాడని, అప్పటివరకు వేచి చూద్దామన్నారు. ఆ తర్వాత కూడా పరిహారం ఇవ్వకపోతే పోరాటం చేద్దామన్నారు.
Kalvakuntla Kavitha | ప్రాజెక్టుల విషయాల్లో రాజకీయాలా?
తనను గెలిపిస్తే మహబూబ్ నగర్కు మంచి చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ (Uddandapur Project)ను పట్టించుకోవటం లేదని కవిత మండిపడ్డారు. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా నారాయణపేట- కొడంగల్ లిప్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ అంటున్నాడని, ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన వెళ్తుండని విమర్శించారు. ప్రాజెక్ట్ విషయంలో రాజకీయాలు వద్దని, ప్రజలకు మేలు జరిగేలా మాత్రమే చూడాలని హితవు పలికారు. ఇళ్లు, భూములు కోల్పోతున్న రైతుల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు.

