అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills by-elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు పోరాడుతున్నాయి.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉప ఎన్నికలను (BY-Elections) సవాల్గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ప్రభుత్వ తీరుపై ప్రజాతీర్పుగా భావించాల్సి ఉంటుంది. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ (Congress) సర్వ శక్తులూ ఒడ్డుతోంది. అలాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతే స్థానిక ఎన్నికలపై ప్రభావం ఉంటుంది. దీంతో జూబ్లీహిల్స్లో గెలుపు కోసం కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని నమ్మకంతో ఉంది.
Jubilee Hills by-elections | బీఆర్ఎస్ సైతం..
తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ముఖ్య నేతలు కేటీఆర్ (KTR), హరీశ్రావు (Harish Rao) ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేసీఆర్ సైతం ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఎన్నికల సంఘం తాజాగా అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది. అందులో కొన్ని గుర్తులు బీఆర్ఎస్ను కలవర పెడుతున్నాయి. రోడ్ రోలర్, చపాతి రోలర్, సబ్బు పెట్టే లాంటి గుర్తులు కారు గుర్తును పోలి ఉంటాయి. దీంతో తమ ఓట్లు ఆ అభ్యర్థులకు పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.
Jubilee Hills by-elections | బరిలో 58 మంది
జూబ్లీహిల్స్ ఎన్నికల (Jubilee Hills elections) బరిలో 58 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదివారం అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది. ఇందులో అంబేడ్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి రాజుకి రోడ్ రోలర్, అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తులు కేటాయించింది. తెలుగు రాజ్యాధికార పార్టీకి చెందిన అభిలాష్కు సబ్బు పెట్టె గుర్తు, ప్రజా వెలుగు పార్టీ అభ్యర్థి ప్రవీణ్కుమార్కు కెమెరా, మరో అభ్యర్థి షిప్ గుర్తును కేటాయించింది. ఈ గుర్తులు కారు గుర్తును పోలి ఉంటాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఆందోళన చెందుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు దీపక్రెడ్డి, నవీన్యాదవ్, మాగంటి సునీత పేర్లు ఈవీఎంలో మొదటి మూడు నంబర్లలో ఉన్నాయి.
Jubilee Hills by-elections | ఫిర్యాదు చేసినా..
కారు గుర్తును పోలిన సింబల్స్ను ఇతరులకు కేటాయించొద్దని గతంలో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఫిర్యాదు కూడా అందించారు. అయితే ఎన్నికల సంఘం బీఆర్ఎస్ వినతిని పట్టించుకోకుండా గుర్తులు కేటాయించడం గమనార్హం. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు మొదటే ఉన్నా.. 58 మంది బరిలో ఉండడంతో 4 ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లో (Poling Station) ఉంచనున్నారు. దీంతో ఓటర్లు పొరపాటున కారుకు బదులు దానిని పోలి ఉన్న ఇతర గుర్తులకు ఓటు వేస్తారని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.

