అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | ఏసీబీ (ACB) అధికారుల వరుస కేసులతో అవినీతి అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుపుతుండడంతో లంచాలకు మరిగిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. కానీ.. లంచం తీసుకోవడం మాత్రం మానడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఆదిలాబాద్ (Adilabad) రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ సంయుక్త సబ్ రిజిస్ట్రార్గా శ్రీనివాస రెడ్డి పని చేస్తున్నారు. ఓ మహిళ పేరు మీద ఉన్న ఇంటిని ఆమె భర్త పేరుపై గిఫ్ట్ డీడ్ (Gift Deed) చేయడానికి కార్యాలయానికి వచ్చింది. శ్రీనివాసరెడ్డి వారిని లంచం అడిగాడు. సదరు మహిళ భర్త ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో శుక్రవారం బాధితుల నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.