అక్షరటుడే, న్యూఢిల్లీ: JoSAA Counseling : దేశ వ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ 2025(JEE Advanced 2025) మే 18న జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 1,87,223 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష మాత్రం 1,80,442 మంది మాత్రమే రాశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 54,378 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వీరిలో 9,404 మంది అమ్మాయిలు, 44,974 మంది అబ్బాయిలు ఉన్నారు.
ఐఐటీ కాన్పూర్(IIT Kanpur) సోమవారం (జూన్ 2) జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలతోపాటు స్కోర్ కార్టుల(score cards)ను జారీ చేసింది. వీటికితోడు పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి ఫైనల్ ఆన్సర్ కీలను అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఢిల్లీ జోన్కు సంబంధించి రజిత్ గుప్తా.. 360 మార్కులకు 332 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్(All India topper)గా నిలిచాడు. సాక్షమ్ జిందాల్ అనే విద్యార్థికి కూడా 332 మార్కులు రావడంతో ఇద్దరినీ టాపర్లుగా ప్రకటించారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు విడుదల కావడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)(joint Seat Allocation Authority (JoSAA) కౌన్సెలింగ్ మంగళవారం (జూన్ 3) ప్రారంభం అయింది.
ఈసారి జోసా ఆరు విడతల్లో సీట్లను భర్తీ చేయనుంది. మంగళవారం నుంచే మొదటి విడత ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. జూన్ 14న మొదటి మొదటి విడత, జూన్ 21న రెండో విడత, జూన్ 28న మూడో విడత, జులై 4న నాలుగో విడత, జులై 10న ఐదో విడత, జులై 16న చివరి విడతకు సంబంధించిన సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఐఐటీ(IIT)ల్లో ఈ ఏడాది మొత్తం 17,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ఐటీ(NIT)ల్లో 24,229 సీట్లు, ట్రిపుల్ ఐటీ (Triple IT)ల్లో 8,546 సీట్లు, గవర్నమెంట్ ఫండెండ్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్లో 9,402 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఏడాది జోసా 2025 కౌన్సెలింగ్లో 127 విద్యా సంస్థలు పాల్గొననున్నాయి. గతేడాది కంటే ఈసారి నాలుగు సంస్థలు అధికంగా ఉన్నాయి.