అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Jagruthi | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను జూన్ 11న విచారణకు వస్తానని కేసీఆర్ కమిషన్కు తెలిపారు.
కాగా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. పలువురు నాయకులు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. కానీ పార్టీ పరంగా నిరసనలకు పిలుపునివ్వలేదు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మహా ధర్నాకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఆమె కేటీఆర్ను ఉద్దేశిస్తూ పలుమార్లు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడం చేతకాదని, బీజేపీలో విలీనం చేయడానికి చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్తో పూర్తిగా దూరంగా ఉంటున్న ఆమె జాగృతి(Jagruthi)పై ఫోకస్ పెట్టారు. ఇటీవల బంజరాహిల్స్లో జాగృతి కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే, జాగృతి మరొ కన్ను లాంటిందన్నారు.
Telangana Jagruthi | ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా
ఇటీవల కవిత మాట్లాడుతూ.. తన తండ్రిపై ఈగ కూడా వాలనివ్వనని అన్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా.. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహా ధర్నాకు కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు తరలి రానున్నారు.