అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరుబాట పట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సూచించారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన విధంగా రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు అంతా ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించారు. గ్రామ గ్రామాన జాయింట్ యాక్షన్ కమిటీలు (JAC) ఏర్పాటు చేసుకొని పోరాడాలన్నారు.
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కులగణన (Caste Census) చేపట్టి బీసీ రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం బిల్లులను ఢిల్లీకి పంపించింది. అయితే కేంద్రం బిల్లులు ఆమోదించకపోవడంతో కాంగ్రెస్ ఇటీవల ఢిల్లీలో (Delhi) ధర్నా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పొన్నం రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు.
BC Reservations | బీసీ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు బీసీ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ముందుండి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని సూచించారు.
BC Reservations | రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీ
కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మంత్రి పొన్నం విమర్శించారు. శాసనసభలో బిల్లుకు ఆమోదం తెలిపిన బీజేపీ ఇప్పుడు మతపరమైన కారణాలు చెప్పి బిల్లును అడ్డుకోవడం సరికాదన్నారు. ముస్లింల పేరు మీద బీజేపీ ఈ చట్టాన్ని అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు.
బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామనడంతో బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే తాము రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరి 10 రోజులైనా కలవనివ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ వెళ్లి ఎదురు చూసినా రాష్ట్రపతి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేరన్నారు. ముస్లింల పేరుతో రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాన్ని కిషన్ రెడ్డి (Kishan Reddy) మానుకోవాలన్నారు. బిల్లులో ఎక్కడా కూడా మతపరమైన ప్రస్తావన లేదన్నారు.