అక్షరటుడే, ఆర్మూర్: Armoor | సమాజంలో యువత గంజాయికి బానిసలై చెడుమార్గం పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందుగా తల్లిదండ్రులదేనని ఈఆర్ ఫౌండేషన్(ER Foundation) ఛైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడు పల్లె నరసింహ బృందం ఆధ్వర్యంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ (Culture Department) సౌజన్యంతో ఆర్మూర్ పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ బస్సు కళాజాత అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించనున్నారు.
కాగా.. శనివారం ఈ బస్సుయాత్ర ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్కు చేరుకుంది. ఈఆర్ ఫౌండేషన్ తరపున ఈరవత్రి రాజశేఖర్ వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు యువతను గంజాయికి (Marijuana) బానిసలను చేస్తున్నారన్నారు. యువత గంజాయికి బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాపోయారు.
డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతిఒక్కరిపై బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో యువత చెడుమార్గం వీడి మంచి భవిష్యత్తుకు బాట వేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జననాట్యమండలి ప్రతినిధులు, బట్టు శ్రీధర్, నారాయణ, లక్ష్మీనారాయణ, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు కుండ రాంప్రసాద్, కొండి రామచంద్ర, నూకల శేఖర్, ఇట్టెం రాంప్రసాద్, ఇంతియాజ్, నవీన్, టైలర్ వినోద్, భవాని శ్రావణ్, రాజేశ్వర్ గౌడ్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
