అక్షరటుడే, ఇందూరు: Ration Cards | రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు. నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) సోమవారం అర్బన్ నియోజకవర్గ లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల కలను రాష్ట్ర ప్రభుత్వ సాకారం చేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ.. తమ ప్రభుత్వం కార్డులను అందిస్తుందని గుర్తు చేశారు. అర్హులైన వారు మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్డులు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Ration Cards | జిల్లాలో 11,852 రేషన్కార్డులు..
రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ పేర్కొన్నారు. జిల్లాలో 11,852 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, 84,232 మంది సభ్యుల పేర్లను కార్డులో చేర్చామన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నార్త్, సౌత్ మండలాల పరిధిలో 3,174 కుటుంబాలకు కొత్త కార్డులు, 1687 మంది సభ్యుల పేర్లు నమోదు చేయడం జరిగిందని చెప్పారు.
Ration Cards | ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు..
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) మంజూరు చేశామని, ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షలు అందిస్తున్నామని షబ్బీర్ అలీ వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు. ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే.. నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Ration Cards | పారదర్శకంగా రేషన్కార్డుల పంపిణీ
అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) మాట్లాడుతూ.. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. ఇంకా దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతోందని, అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు (State Agricultural Commission) గడుగు గంగాధర్, నుడా (NUDA) ఛైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సౌత్, నార్త్ తహశీల్దార్లు బాలరాజు, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.