అక్షరటుడే, వెబ్డెస్క్: Iran – Israel | ఇరాన్ లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం (central government) చేపట్టిన ‘ఆపరేషన్ సింధు’ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇండియన్ల తరలింపు కోసం ఇరాన్ మూసేసిన తన గగన తలాన్ని శుక్రవారం ప్రత్యేకంగా తెరిచింది. భారతీయ విద్యార్థుల తరలింపు కోసం ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరాన్ లోని వివిధ నగరాల్లో చిక్కుకున్న కనీసం 1,000 మంది భారతీయ విద్యార్థులు ఇండియాకు చేరుకోనున్నారు. అత్యవసర తరలింపు కార్యక్రమం ఆపరేషన్ సింధు (Operation Sindhu) భాగంగా రానున్న రెండ్రోజుల్లో వారు ఢిల్లీకి రానున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు మొదటి విమానం ఢిల్లీలో దిగుతుందని భావిస్తున్నారు. శనివారం మరో రెండు విమానాలు భారతీయ విద్యార్థులను (Indian students) తీసుకుని శనివారం రానున్నాయి.
Iran – Israel | ఆపరేషన్ సింధు
ఇజ్రాయెల్-ఇరాన్ (Iran – Israel) మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ లో విద్య, ఉపాధి కోసం వెళ్లిన నాలుగు వేల మంది భారతీయులు (Indians) అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో తన మిత్రదేశమైన ఇరాన్ తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. తమ విద్యార్థులను తరలించడానికి సహకరించాలని కోరడంతో అంగీకరించిన టెహ్రాన్.. గగన తలాన్ని తెరిచింది. ఇజ్రాయెల్ తో పెర్షియన్ గల్ఫ్ దేశం (Persian Gulf country) వివాదం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఇరాన్ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం బుధవారం ‘ఆపరేషన్ సింధు’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం (Indian embassy) ఉత్తర ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులను ఇప్పటికే సురక్షితంగా తరలించింది.