అక్షరటుడే, వెబ్డెస్క్: IPL | ఐపీఎల్ 2025 సీజన్లో తొలి టైటిల్ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) RCB విజయంపై అభిమానుల్లో ఆనంద ఉత్సాహానికి అవధే లేకుండా పోయింది. 18 ఏళ్ల తర్వాత టైటిల్ను సొంతం చేసుకున్న ఆర్సీబీ, బెంగళూరులో విజయోత్సవ వేడుకలను భారీగా నిర్వహించింది. అయితే ఈ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వెలుపల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో తొక్కిసలాట ఏర్పడింది. ఈ దుర్ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా(BCCI Secretary Devajit Saikia), ఆర్సీబీ అత్యుత్సాహంతో తొందరగా వేడుకలు నిర్వహించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. సమయానికి తగిన ప్రణాళిక లేకుండా వేడుకలు నిర్వహించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
IPL | ఇది నిజమా?
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) న్యాయ విచారణను ప్రారంభించింది. విచారణలో బాధ్యత వహించాల్సిన వారిపై చర్యలు తీసుకుంటూ, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్(RCB Marketing Head), డీఎన్ఏ ఈవెంట్ మేనేజర్స్(DNA Event Managers), వారి వైస్ ప్రెసిడెంట్(Vice President)లను అరెస్ట్ చేసింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై బీసీసీఐ BCCI కూడా కఠినంగా స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడడానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఆర్సీబీపై ఏడాది నిషేధం విధించారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఐపీఎల్ నిర్వాహకులు ఆర్సీబీని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారన్న వాదనలు కూడా వినిపించాయి.
అయితే ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని ఫ్యాక్ట్ చెక్(Fact Check)ద్వారా తేలింది. ఆర్సీబీపై బాన్ వేశారన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టమైంది. బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులన్నీ ఊహాగానాలేనని ఆర్సీబీ అభిమానులు తేల్చిచెప్పారు. దిగ్గజ ప్రాంచైజీ అయిన ఆర్సీబీపై నిషేధం విధిస్తే, ఆర్థికపరంగా ఐపీఎల్కే నష్టం వాటిల్లుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించగా.. కర్ణాటక ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి అవసరమైన అన్నివిధాలా అండగా ఉంటామని ఆర్సీబీ తెలిపింది.