అక్షరటుడే, వెబ్డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025 చివరి దశకు చేరుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) నెగ్గడంతో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
గుజరాత్ టైటాన్స్ నెగ్గి ప్లే ఆఫ్స్కు చేరుకోవడంతో పాటు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ప్లే ఆఫ్స్కు తీసుకెళ్లింది. ప్రస్తుతం గుజరాత్, పంజాబ్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీ పడుతున్న నేపథ్యంలో గత రాత్రి జరిగిన మ్యాచ్లో లక్నో ఓటమితో ప్లేఆఫ్స్ నుండి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలు కావడంతో ఈ సీజన్ నుండి లక్నో తొలగించబడింది.
IPL 2025 | లక్నో ఔట్..
నాకౌట్స్కు చేరాలంటే మిగిలి ఉన్న అన్ని మ్యాచ్ల్లోనూ లక్నో నెగ్గాలి. కాని సోమవారం సన్ రైజర్స్పై జరిగిన పోరులో ఓటమి పాలైంది. దాంతో ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయాయి. లక్నో తన తదుపరి మ్యాచ్ ముంబై, ఆర్సీబీలతో ఆడాల్సి ఉంది. ఇందులో రెండు గెలిచిన కూడా లక్నో ప్లే ఆఫ్స్కి (Play offs) చేరడం కష్టం. ఇక సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో సోమవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఓటమి పాలైంది. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. చివరి రెండు మ్యాచ్ల్లో ఆ జట్టు గెలిచినా టోర్నీలో ముందడుగు వేసే పరిస్థితి లేదు. ఈ గెలుపుతో సన్రైజర్స్ హైదరాబాద్ మరో 2 పాయింట్స్ను ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. పోతుపోతూ లక్నోను కూడా తమ వెంట తీసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 65), ఎయిడెన్ మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 45) దూకుడుగా ఆడాడు. 206 పరుగుల భారీ లక్ష్యచేధనలో అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతున్నఅ తని దిగ్వేష్ రతి పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన హెన్రీ క్లాసెన్, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీకి చేరువైన హెన్రీచ్ క్లాసెన్(Klassen)ను శార్దూల్ ఠాకూర్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. చివరలో అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలు విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.