అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్(Sriram Sagar Project)కు వరద నీరు తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం జలాశయంలోకి 34 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. మంగళవారం ఉదయానికి 5,658 క్యూసెక్కులకు పడిపోయింది.
ఎస్సారెస్పీలో పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1080 (44.9 టీఎంసీలు) అడుగులకు చేరింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు(Heavy Rains) లేకపోవడంతో జలాశయంలోకి ఇన్ఫ్లో ఎక్కువగా రావడం లేదు. కొద్ది రోజులుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్లోకి వరద వస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో జలాశయంలోకి వరద పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల
ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ(Kakatiya Canal) ద్వారా 3,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231, లక్ష్మీ కాల్వ ద్వారా 150, సరస్వతి కాల్వ ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలీ సాగర్ ఎత్తిపోతలకు 360, గుత్ప ఎత్తిపోతలకు 191 క్యూసెక్కుల వదులుతుండగా.. ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు నీరు పోతోంది. నవంబర్ 20 వరకు వానాకాలం పంటలకు నీటిని విడుదల చేయనున్నారు.
కాకతీయ కాలువ జోన్ -1కు ఏడు రోజులు జోన్- 2 కు 8 రోజుల పాటు నీటిని అందించనున్నారు. మిగిలిన కాలువలకు ఏడు రోజుల ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు. కాగా జలాశయంలోకి సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రెండు టీఎంసీల నీరు వచ్చి చేరింది.
Sriram Sagar | నిండుకుండలా పోచారం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నీటిమట్టం 20.5 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ఎగువ నుంచి స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతోంది. వర్షాలు పడితే ఒకటి రెండు రోజుల్లో ప్రాజెక్ట్ పొంగి పొర్లనుంది. కాగా జలాశయం నుంచి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు సాగు నీటి విడుదల కొనసాగుతోంది.