అక్షరటుడే, వెబ్డెస్క్ : Inflation Rate | రాష్ట్రంలో ద్రవ్యోల్బణం (Inflation) భారీగా తగ్గింది. వరుసగా రెండో సారి మైనస్లో నమోదు అయింది. జూన్లో తెలంగాణ (Telangana)లో ద్రవ్యోల్బణం -0.93 శాతంగా ఉండగా, జులైలో –0.44గా నమోదు అయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పడు కూడా ద్రవ్యోల్బణం మైనస్లో నమోదు కాలేదు. తాజాగా వరుసగా రెండు సార్లు ఇన్ఫ్లేషన్ రేట్ మైనస్లో ఉండటంతో ఆర్థిక విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
ద్రవ్యోల్బణం పెరిగితే రేట్లు పెరుగుతాయి. అదే తగ్గితే రేట్లు దిగి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మైనస్ ద్రవ్యోల్బణం నమోదు కావడంతో రేట్లు భారీగా తగ్గినట్లు అర్థం. రేట్లు తగ్గితే మంచిదే కాదా అంటారా.. కానీ అక్కడే తిరకాసు ఉంది. ఇన్ఫ్లేషన్ మైనస్లోకి వెళ్లిందంటే.. వస్తువులకు డిమాండ్ తగ్గిందని అర్థం. దీంతో కంపెనీల లాభాలు తగ్గుతాయి. ప్రోడక్టివిటీ తగ్గి కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతుంది. అలాగే ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ఆదాయం (Tax Income) కూడా తగ్గుతుంది.
Inflation Rate | అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
దేశంలో కోవిడ్ వ్యాప్తి సమయంలో రాష్ట్రం 10 శాతానికి పైగా ద్రవ్యోల్బణంతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా మైనస్ ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం, నెగిటివ్ ద్రవ్యోల్బణం రెండూ కూడా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
Inflation Rate | జాతీయ సగటు 2.10
గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జులైలో తెలంగాణలో ద్రవ్యోల్బణ రేటు -0.44 శాతంగా ఉంది. ఇదే టైమ్లో జాతీయ సగటు 2.10 శాతం ఉండటం గమనార్హం. జూన్లో తెలంగాణలో ద్రవ్యోల్బణం -0.93 శాతంగా ఉండగా, జాతీయ సగటు 1.55 శాతంగా ఉంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ఆర్థిక కార్యకలాపాలు తగ్గడానికి ఈ పరిస్థితి నిదర్శనం. ప్రజలు కనీస అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు అంటున్నారు. ఆర్బీఐ (RBI) ప్రకారం ఇన్ఫ్లేషన్ రేటు 2 నుంచి 4శాతం మధ్య ఉండాలి. అంతకంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా.. ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు.
Inflation Rate | సీఎంపై హరీశ్రావు ఆగ్రహం
తెలంగాణ ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్లడంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆర్థిక నిర్వహణలో విఫలం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వరుసగా రెండో నెల కూడా ద్రవ్యోల్బణంలోకి మైనస్లో ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ రివర్స్ గేర్లో ఉందనడానికి ఇది ప్రమాదకరమైన సంకేతమని ఆయన హెచ్చరించారు. డిమాండ్ కుప్పకూలిపోతున్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
