అక్షరటుడే, వెబ్డెస్క్ : Indore MBA Student Murder | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగిన ఓ దారుణ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎంబీఏ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వేధించిన యువకుడు చివరికి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయడం కలకలం రేపుతోంది.
నిందితుడి ప్రవర్తన, హత్య అనంతరం అతడు చేసిన చర్యలు పోలీసులను సైతం షాక్కు గురిచేశాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 10న నిందితుడు పీయూష్ ధామ్నోటియా బాధిత యువతిని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి యత్నించగా యువతి ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక కూడా కత్తితో ఛాతీపై పొడిచి మరింత దారుణంగా ప్రవర్తించినట్టు విచారణలో తేలింది.
Indore MBA Student Murder | ఆత్మలని పిలిచే వీడియోలు చూస్తూ..
హత్య అనంతరం నిందితుడు శవం పక్కనే కూర్చొని మద్యం సేవించడమే కాకుండా, బాధితురాలి ఫోన్ నుంచి అసభ్యకర వీడియోలను వాట్సాప్ స్టేటస్లో పెట్టి పరారయ్యాడు. అంతేకాకుండా ఆమె శవంపై లైంగిక దాడి చేసి, దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ చర్యలు కేసును మరింత సంచలనంగా మార్చాయి. హత్య తర్వాత నిందితుడు మహారాష్ట్రలోని (Maharashtra) ముంబై నగరానికి పారిపోయి పన్వేల్ ప్రాంతంలో దాక్కున్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్న సమయంలో యూట్యూబ్లో (YouTube) ఆత్మలను పిలిచే విధానాలపై వీడియోలు చూస్తూ, తాను చంపిన యువతి ఆత్మతో మాట్లాడాలని ప్రయత్నించినట్టు విచారణలో వెల్లడైంది. ఘటనాస్థలంలో అగరుబత్తులు వెలిగించి క్షమాపణలు కోరినట్లు సమాచారం. అతడి మానసిక స్థితి సరిగా లేదేమో అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్ ట్రాకింగ్ ఆధారంగా నిందితుడిని ముంబైలో అరెస్ట్ చేసిన ఇండోర్ పోలీసులు (Indore Police), ప్రస్తుతం మూడు రోజుల రిమాండ్లో ఉంచి విచారిస్తున్నారు. ఆన్లైన్ డేటింగ్ యాప్ల ద్వారా బాధితురాలు వేరే వారితో మాట్లాడుతుందన్న అసూయతోనే ఈ హత్యకు పాల్పడ్డానని నిందితుడు ఒప్పుకున్నట్టు సమాచారం. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలంలో కత్తి, తాడు, డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నాయి. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున బాధితురాలు తన ఆధార్ కార్డు సరిచేయించుకోవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె తండ్రి కలెక్టరేట్ సమీపంలో దింపాడు. అనంతరం తన చెల్లెలికి ఫోన్ చేసి క్లాస్మేట్ పీయూష్తో కలిసి పుట్టినరోజు వేడుకకు వెళ్తున్నానని.. రాత్రి 11 గంటలకు తిరిగి వస్తానని చెప్పింది. కానీ ఆ సమయానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించగా ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.